‘గాంధీ’ ది గ్రేట్.. దేశంలోనే నెంబర్ 1 స్థానం..

by  |
Gandhi Hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా రోగులకు చికిత్సను అందించడంలో గాంధీ దవాఖాన దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కరోనా మొదటి వేవ్​ నుంచి ఇప్పటి వరకు 84,127 మంది పేషెంట్లకు వైద్యం అందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో 1,688 మంది కరోనా సోకిన గర్భిణులకు పురుడు పోసి, తల్లీ, బిడ్డలను కాపాడటం విశేషం. కనీసం ఒక్కరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదంటే డాక్టర్ల పనితీరును అభినందించవచ్చు. దీంతో పాటు 3,762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులకు, హైరిస్క్​ గ్రూప్​కు చెందిన 8,178 డయాలసిస్​ పేషెంట్లకు అత్యధిక రిస్క్​తో ట్రీట్​మెంట్​ అందించి కాపాడారు.

సెకండ్​ వేవ్‌లో దడ పుట్టించిన బ్లాక్​ ఫంగస్‌కు ​క్రిటికల్​ కేర్ చికిత్సలు కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు గాంధీకి 1,786 బ్లాక్​ ఫంగస్​ కేసులు విషమ పరిస్థితుల్లో రాగా, వీటిలో 1,163 మందికి సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడారు. మిగతా వారీకి మందులు రూపంలో నయం చేశారు. దీంతో పాటు ఓపీ ద్వారా మరో 5,358 పేషెంట్లను బాగు చేశారు. వీరిలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వచ్చినట్లు దవాఖాన అధికారులు తెలిపారు. కరోనా సోకి తీవ్రమైన గాయాలతో ఉన్న మరో 113 మందికి స్పెషల్​ వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందించారు.

సకాలంలో వైద్యం అందించడం వలనే రికవరీ రేట్​ 98% సాధించినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కేవలం 44 మంది కరోనా పేషెంట్లు మాత్రమే దవాఖానలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో పది మంది బ్లాక్​ ఫంగస్​ బాధితులని తెలిపారు.

Gandhi Hospital

పేదలకు అండ..

కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో గాంధీ ఆస్పత్రి ఎంతో మంది పేదలకు అండగా నిలిచింది. ప్రైవేట్​, కార్పొరేట్​ దవాఖానలు చేతులెత్తేసిన ఉన్నత వర్గాల వారిని కూడా గాంధీ దవాఖాన అక్కున చేర్చుకొన్నది. ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​ సూచించిన సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కించింది. బెడ్లు దొరకని పరిస్థితుల్లోనూ పేషెంట్​ రక్షణ కోసం గాంధీ వైద్యులు ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వైద్యం అందించడం అభినందనీయం.

డాక్టర్లు, నర్సులు, పారమెడికల్​, ఇతర సిబ్బంది అంకిత భావంతో పని చేస్తూ దవాఖానకు మంచిపేరు తీసుకువచ్చారు. తొలి కేసు తేలినప్పటి నుంచి ప్రభుత్వం గాంధీకి అన్ని విధాలుగా సాయం అందించిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక సూపరింటెండెంట్​డా రాజారావు, నోడల్​ ఆఫీసర్​ డా ప్రభాకర్​రెడ్డి కరోనా పీక్​ సమయంలో కనీసం ఒక్క రోజు సెలవు పెట్టకపోవడం అభినందనీయం.

మూడు సార్లు ప్రతి వార్డునూ సందర్శించా

‘కరోనా ప్రారంభమైనప్పటి నుంచి సెకండ్​ వేవ్​ ముగిసే వరకు కనీసం ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటలు వరకు ఆస్పత్రిలోనే ఉండి రోగుల చికిత్సను పరిశీలించే వాడిని. రోజూ ప్రతి వార్డుకు మూడు సార్లు తిరుగుతూ పేషెంట్ల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే వాళ్లం. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే భయం షురూ అవుతుంది. మా టీం నిత్యం కరోనా వార్డులనే సందర్శించేద’ని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.



Next Story