‘ధరణి’తో కొత్త ఇబ్బందులు..

by  |
‘ధరణి’తో కొత్త ఇబ్బందులు..
X

దిశ ప్రతినిధి, మెదక్ :

ఉమ్మడి మెదక్ జిల్లాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రెండున్నరేండ్లు గడిచింది. ఉమ్మడి జిల్లాల్లోని ఆయా గ్రామాల పరిధిలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి ధరణిలో ఎంట్రీ చేశారు. రైతులకు ఉన్న వాస్తవ భూముల విస్తీర్ణం అనుకూలంగా కొందరికి పట్టాలు వచ్చినా.. మరి కొందరిలో గందరగోళం నెలకొంది. ఉన్న వాస్తవ విస్తీర్ణానికి సంబంధం లేకుండా తక్కువ చూపుతూ వివరాలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

ఇక కోర్టులు ఉన్న భూములకు పట్టా ఇవ్వలేదు. మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సుమారు ఐదు లక్షల మందికి పటాలను మంజూరు చేశారు. అటవీ భూముల ఉమ్మడి సర్వే ఇంకా పూర్తి కాకపోవడంతో వాటి ఇబ్బందులకు పరిష్కారం దొరకలేదు. ఉమ్మడి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాలకు పైగా ఈ భూములు ఉన్నట్టు సమాచారం. వీటిలో కొన్నింటిని రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, తమకు వీటికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కొన్నిచోట్ల అటవీ అధికారులు భూములను స్వాధీనం చేసుకుని హరితహారం మొక్కలు నాటారు.

ఇబ్బందులు తప్పడం లేదు..

జిల్లాల్లో భూముల లెక్కలు భూ ప్రక్షాళనతో తేలినా ఇంకా సమస్యలు తగ్గడం లేదు. ఇప్పటికీ పట్టాలు పొందిన వారు అందులో మార్పులు, తప్పొప్పుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నింటిలో ఇంటిపేర్లు, ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు సరితూగడం లేదు. వారు దరఖాస్తు చేసుకుంటే కొన్నింటిని మాత్రమే సవరిస్తున్నారు. మరి కొంత మంది పట్టాలో భూ విస్తీర్ణానికి సంబంధించిన పొరపాట్లు తలెత్తాయి. భూ ప్రక్షాళన తర్వాత ధరణి వెబ్‌సైట్ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానం చేయకపోవడం వల్ల కొత్తగా భూములు కొన్నవారు ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు మొదట రిజిస్ట్రేషన్ కార్యాల‌యంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ భూముల వివరాలను మీ సేవకు వెళ్లి మళ్లీ మ్యూటెషన్ కోసం తహసీలార్డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. చాలా మండలాల్లోని ఈ రెండు శాఖల అధికారుల చుట్టూ అనేక మంది నిత్యం తిరుగుతున్నారు. ఆ తర్వాతనే భూములు మ్యూటేషన్ అయి కొన్న వారికి చేతికి పట్టా వస్తోంది. ధరణి వెబ్‌సైట్ వివరాలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేస్తే ఇబ్బందులు తప్పేవి. రిజిస్ట్రేషన్ చేసిన భూముల వివరాలు నేరుగా సంబంధిత తహసీల్దార్‌కు వెళ్లేవి. భూముల పట్టాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా చేతికి వచ్చేవి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అన్ని వివరాలు అందకపోవడం వల్ల కొన్ని వివాదాస్పద భూములు సైతం రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. దీంతో కొన్నవారు నష్టపోతున్నారు.

కరోనా కారణంగా..

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలను కార్యాలయాలకు అధికారులు అనుమతించడం లేదు. దరఖాస్తు తీసుకుని బయటి నుంచి పంపించేస్తున్నారు. దరఖాస్తు తీసుకున్న అధికారులు వాటిని పరిష్కరించడంలో జాప్యం చేస్తుండటంతో బాధితులు తిరిగి కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అధికారులు నేరుగా కలవడం లేదు.

Next Story

Most Viewed