పంచాయతీలుగా మారినా అభివృద్ధి అంతంతే

by  |
పంచాయతీలుగా మారినా అభివృద్ధి అంతంతే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,057 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో మూడు డివిజనల్ పంచాయతీ పరిధి 27 మండలాల్లో మొత్తం 530 జీపీలున్నాయి. అందులో కొత్తగా ఏర్పడినవి 151 కాగా, 71 తండాలు జీపీలుగా రూపాంతరం చెందాయి. కామారెడ్డి జిల్లాలో మూడు డివిజనల్ పంచాయతీ పరిధి 22 మండలాల్లో 527 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 88 తండాలు పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. అందులో మెజార్టీ పంచాయతీలకు అధికార పార్టీ సర్పంచ్ లే ఉన్నారు. ఎక్కువ తండాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలే ఉన్నా ప్రోత్సహకాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. గత పాలకవర్గ హయాంలోనే ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు ఇచ్చారని, ఇప్పటికీ అవే రాలేదని, ఇప్పుడు కొత్తగా నిధులు, ప్రోత్సహకాలు వస్తాయా అని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఉన్నట్టే అన్ని జీపీలకు కార్యదర్శులు ఉన్నారు. అయితే ఉపాధి హామీ పనుల్లో కీలకమైన హరితహారం నిర్వహణ వారికి కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే పనిభారం అధికమని సుమారు 62 మంది పంచాయతీ కార్యదర్శి పదవులు వద్దని చెప్పగా, రెండో విడతలో సెకండ్ లిస్ట్ ద్వారా అన్ని ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు కేవలం హరితహారం మొక్కలను రక్షిస్తూ వేటుకు గురికాకుండా ఉండే పనిలో పడ్డారు

పంచాయతీగా మారిన పరిస్థితి అధ్వానం

తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న పాఠశాల భవనాలు, కమ్యూనిటీ భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఫండ్స్​ఇవ్వక పోవడంతో ఈజీఎస్​నిధులతో చేపట్టిన భవనాల పనులను నత్తతో పోటీ పడుతున్నాయి. చాలా పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ల కొరత ఉంది. దీంతో పాలకవర్గాలే నియమాకాలు చేపట్టి, పంచాయతీలకు వచ్చిన పన్నులు, ఎస్ఎఫ్ సీ నిధుల నుంచి వారికి నెలనెలా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్​వస్తుండగా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఓ నెల ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు. అధికారులేమో నిధులు తమ ప్రమేయం లేకుండా నేరుగా ట్రెజరీ ద్వారా పంచాయతీల ఖాతాల్లో వస్తున్నాయని, దీంతో ఖర్చులు మాత్రమే పరిశీలన చేస్తున్నామని చేతులెత్తేస్తున్నారు.

ఈజీఎస్​ నిధులే దిక్కు..

కేంద్రం ఇచ్చే నరేగా నిధులతోనే గ్రామాల్లో నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్ల పనులు జరుగుతున్నాయి. మిగిలిన కంపోస్ట్​షెడ్​లు, డంపింగ్ యార్డుల డెవలప్​మెంట్​పనులకు సైతం ఉపాధి నిధులే ఉతమిస్తున్నాయి. మిషన్​భగీరథ నీరు తండాలకు సురక్షిత తాగునీరందిస్తున్నారు. పలు పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూలు చేసిన ఐదో తేదీన ఖజానాకు జమ చేయాల్సి వస్తోందని సర్పంచ్​, కార్యదర్శులు వాపోతున్నారు. పాలన పరంగా పాత గ్రామ పంచాయతీల స్థాయిలో ఒత్తడి లేకున్నా ఫర్వాలేదంటున్నారు. కొత్తగా ఏర్పడిన తండాలకు ప్రత్యేక నిధులివ్వాలని గతంలో జనరల్ పంచాయతీల్లో ఎస్ సీ, ఎస్ టీ కాంపోనెంట్​నిధులు ఏవిధంగా వచ్చాయో వాటి మాదిరిగా తండాలకు, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తే బాగుంటుందంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోనుంచి విడిపోయి కొత్తగా మూడు గుడిసెల తండా పంచాయతీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 541, ఓటర్ల సంఖ్య 371. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదికి రంగులు వేసి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన జీపీలకు స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్ నిధులు వస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. తండాకు ఇప్పటి వరకు ఎస్ఎఫ్ సీ నిధులు రూ.5,91,696, 14 వ అర్థిక సంఘం నిధులు రూ.4,76,108 మాత్రమే వచ్చాయి. పారిశుధ్య, మల్టీ పర్సస్ వర్కర్ల నియమించుకున్న వారికి అందులోంచే వేతనాలను ఇస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం రుణం తీసుకుని ట్రాక్టర్, నీటి ట్యాంకర్లను కోనుగోలు చేశారు. ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డు నిర్మాణం చేసి కంపోస్ట్​షెడ్ నిర్వహణ కు సన్నాహాలు చేస్తున్నారు. నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్​లలో మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.

Next Story

Most Viewed