వరల్డ్ వాక్:ప్రపంచానికి వలసల వేదన

by Disha edit |
వరల్డ్ వాక్:ప్రపంచానికి వలసల వేదన
X

శత్రువైనా సరే శరణు జొస్తే ఆశ్రయం కల్పించాలి' అని మనం నేర్చుకున్న నీతి. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఇలాంటి సమయాలలోనే ఆచితూచి అడుగులు వేయాలి. శరణార్థులుగా మన దేశానికి వేరే దేశాల ప్రజలు రావడం మన దేశానికి ఇబ్బందికర విషయమే. ఎందుకంటే, ఇప్పటికే మన దేశంలో సుమారు 28 కోట్ల మంది ఆకలితో విలవిలలాడుతున్నారు. వారి అవసరాలు తీర్చడమే మన పాలకులకు కష్టతరంగా మారింది. పైగా చాలా మంది కరోనా వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. సుమారు తొమ్మిది శాతానికి పైబడి నిరుద్యోగ రేటు పెరిగింది. ప్రస్తుత తరుణంలో శ్రీలంక శరణార్థులు మనకు మరో భారంగా, ఒక గుదిబండలా మారతారు. దానికి బదులు శ్రీలంక కోరిన విధంగా ఆ దేశానికి కొంత ఆర్థిక సహకారం త్వరితగతిన అందించాలి.

క దేశం నుంచి మరొక దేశానికి లక్షల మంది తమ సొంత ఇండ్లు, ఊళ్లు వదిలి అరచేతిలో ప్రాణాలు పట్టుకుని 'బతుకు జీవుడా' అంటూ, పొరుగు దేశాలకు చేరి తలదాచుకుంటున్నారు.‌ అంతర్యుద్ధాలు, సైనిక పాలన, ఉగ్రవాద దాడులు, నియంత పాలన, ఉద్యోగ ఉపాధి అవకాశాల లేమి, సామాజిక అసమానతలు, ఆర్థిక, రాజకీయ కారణాల వలన వలసలు విస్తృత స్థాయిలో జరుగుతుంటాయి. ముఖ్యంగా సిరియా, ఇరాక్, లిబియా,సోమాలియా, సూడాన్ వంటి దేశాల నుంచి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగానే ప్రారంభమైన వలసలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి.

అఫ్ఘానిస్తాన్, ఉక్రెయిన్ ప్రజలు కూడా యుద్ధం జరుగుతుండగా సుమారు 3.6 మిలియన్ల మంది సమీప దేశాలకు వలస వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే, శరణార్థులుగా వచ్చినవారిని ఆ దేశాలవారు కూడా మానవతా దృక్పథంతో అక్కున చేర్చుకుంటున్నారు. దీని వలన ఆయా దేశాలవారికి కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వలసలు ఆ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర అంశాల మీద ప్రభావం చూపుతాయి. అందుకే యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు సంయమనం పాటించాలి. శాంతియుతంగా చర్చలు జరపడమే యుద్ధ నివారణకు మార్గమని అన్ని దేశాలు గుర్తించాలి. ఐక్యరాజ్య సమితి సలహాలు, సూచనలతో సమస్యలను పరిష్కారం చేసుకుని యుద్ధ నివారణకు తక్షణమే చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలి.

శ్రీలంక సంక్షోభం

మన సరిహద్దు దేశంగా ఉన్న శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో అక్కడి నుంచి శరణార్థులుగా మన దేశానికి వచ్చేవారు ఎక్కువయ్యారు. ఇప్పటికే భారత్‌లో బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్ వంటి దేశాల నుంచి ఎన్నో లక్షల మంది శరణార్థులుగా వచ్చారు. చాలా మంది మన దేశ సరిహద్దు ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చేరుకుని అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారు. నాయకత్వ లోపం, మితిమీరిన, అవినీతి, కరోనాలాంటి వాటి వలన శ్రీలంకలో ముందుగా ఆహార సంక్షోభం నెలకొంది. దానిని నియంత్రించకపోవడంతో, అనంతరం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంక ఒక్క చైనా దేశానికే 500 బిలియన్ల డాలర్ల అప్పు చెల్లించవలసి ఉంది. అది తీర్చలేక ఒక పోర్ట్‌ను వారికి లీజుకు ఇచ్చింది.

శ్రీలంకలో ఆహార భద్రత గాలిలో దీపంగా మారింది. ధరలు విపరీతంగా పెరిగి కేజీ చికెన్ 1000, ఒక కప్పు టీ 100, కోడి గుడ్డు రూ.35, లీటర్ పెట్రోల్ సుమారు 300కు చేరిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చివరికి పేపర్ కొరత వలన దేశంలో కనీసం పిల్లలకి పరీక్షలు నిర్వహించలేని స్థితికి ప్రభుత్వం దిగజారింది. అలాగే ఒక డాలర్ విదేశీ మారకం విలువ 280 రూపాయలు చెల్లించే స్థితిలోకి నెట్టివేయబడింది. ఇది ఇలాగే కొనసాగితే విదేశి మారక ద్రవ్యం సింగిల్ డిజిట్‌లోకి జారుకుంటుంది. ఇటువంటి పరిస్థితులలో మన దేశంలోకి శ్రీలంక ప్రజలు శరణార్థులుగా వలస వస్తున్నారు.

మన పరిస్థితి చూసుకోవాలి

'శత్రువైనా సరే శరణు జొస్తే ఆశ్రయం కల్పించాలి' అని మనం నేర్చుకున్న నీతి. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఇలాంటి సమయాలలోనే ఆచితూచి అడుగులు వేయాలి. శరణార్థులుగా మన దేశానికి వేరే దేశాల ప్రజలు రావడం మన దేశానికి ఇబ్బందికర విషయమే. ఎందుకంటే, ఇప్పటికే మన దేశంలో సుమారు 28 కోట్ల మంది ఆకలితో విలవిలలాడుతున్నారు. వారి అవసరాలు తీర్చడమే మన పాలకులకు కష్టతరంగా మారింది. పైగా చాలా మంది కరోనా వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. సుమారు తొమ్మిది శాతానికి పైబడి నిరుద్యోగ రేటు పెరిగింది. ప్రస్తుత తరుణంలో శ్రీలంక శరణార్థులు మనకు మరో భారంగా, ఒక గుదిబండలా మారతారు. దానికి బదులు శ్రీలంక కోరిన విధంగా ఆ దేశానికి కొంత ఆర్థిక సహకారం త్వరితగతిన అందించాలి. శ్రీలంక ప్రభుత్వం, నాయకత్వం బేషజాలకు పోకుండా ఐఎంఎఫ్ నుంచి రుణాలు పొంది ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలి.‌ పర్యాటక అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలి. ‌దీనికంతటికీ కారణం పాలనా వైఫల్యం. దానిని వెంటనే సరిదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. శ్రీలంక ప్రజల శోకం తగ్గించాలి. వారి సమస్యలు ఇతర దేశాలకు అవస్థలు తేకూడదు.

స్వయం సమృద్ధి సాధించాలి

శరణార్థులుగా జనం వలసల బాట పట్టడానికి ఆయా దేశాల పాలకులు, వారు తీసుకునే విధాన నిర్ణయాలు ముఖ్య కారణమవుతాయి. వర్తమాన చరిత్ర ఆ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేస్తున్నది. కావున పాలకులు ఆయా దేశాల ప్రజల సమస్యలను నివారించేందుకు ముందుగా నడుం బిగించాలి. స్వయం సమృద్ధి సాధించాలి. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి పరచాలి. విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆరోగ్య రంగంపై దృష్టి సారించాలి. వివక్షతలు, వివిధ అసమానతలపై కొరడా ఝులిపించాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. శాంతి-సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వలసలు అరికట్టడానికి, శరణార్థులు స్వదేశాలకు సగౌరవంగా తిరిగి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాలవారికి అదనపు భారం తగ్గించినట్లు అవుతుంది. అన్ని దేశాల సమాన అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.

ఐ. ప్రసాదరావు‌

కాకినాడ

99482 72919

Next Story