ఇంకా పాలితులమేనా.. పాలకులం కావద్దా?

by Disha edit |
ఇంకా పాలితులమేనా.. పాలకులం కావద్దా?
X

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గానీ ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదంటే అతిశయోక్తి కాదు. అటు దేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 52% ఉన్న బీసీ జనాభా నుండి ఒక ముఖ్యమంత్రి పదవి చేపడుత లేడు అంటే కారణం ఏమై ఉంటుంది? అగ్రవర్ణ పాలకులకు జెండాలు మోయాలన్నా, జై కొట్టాలన్నా, వారికి ఓట్లు వేయాలన్నా అత్యధిక జనాభా ఉన్న బీసీ వాళ్లను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారు. ఎందుకంటే వారిలో ఐక్యత లోపించడమే కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బీసీలకు అంగ బలం, అర్ద బలం, మీడియా సహకారం లేకపోవడం కూడా ఒక లోపమే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది కానీ ఏ ఒక్క సారి కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో బలమైన బీసీ వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, పి శివశంకర్ సర్దార్, మల్లికార్జున్ గౌడ్ ఇలాంటి సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పటికీ, వీరిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి ముఖ్యమంత్రి పదవికి దూరం చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రం అయినా, ఎస్సీ నుండి ఒకరికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా రెండు సంవత్సరాలు మాత్రమే...

ఓటు బ్యాంకుగానే మిగిలిన బీసీలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50% పైగా ఉన్న బీసీ జనాభాను కాదని, ఏడు శాతం ఉన్న రెడ్డిలు 32 సంవత్సరాలు, ఐదు శాతం ఉన్న కమ్మవారు 21 సంవత్సరాలు అదే విధంగా మూడు శాతం ఉన్న వెలమలు 9 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది అంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేశాయి అనడానికి ఇది నిదర్శనం. బీసీలను జాతీయ పార్టీలే కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా మోసం చేశాయనడానికి టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు ఉదాహరణలు. ఇవి కూడా వారి పార్టీలలో బీసీలను అణగదొక్కి ఓటు బ్యాంకు గానే చూడడం జరిగింది.

బీసీ సీఎంలను చూడగలమా?

భారతదేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను చూడడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే ఇప్పటికీ కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు.. ఈ రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే జనాభాలో అధికంగా ఉన్న బీసీలు ఐక్యంగా ఉండి సొంత పార్టీలను ఏర్పాటు చేసుకొని మన ఓట్లు మనమే వేసుకుని రాజ్యాధికారం వైపు మళ్ళినప్పుడే సాధ్యమవుతుంది. ఇందుకు ఉదాహరణగా బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తమిళనాడులో కరుణానిధి, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ వీరు ఆయా రాష్ట్రాల్లో సొంత పార్టీలను ఏకం చేసి, వారి జనాభాకు అనుకూలంగా వారి ఓట్లు వారే వేసుకొని రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను కలుపుకొని వారి జనాభా దామాషా ప్రకారంగా వారికి సీట్లు కేటాయించి ముందుకు సాగితేనే ఇది సాధ్యమవుతుంది.

రాజ్యాధికారం బీసీలకే దక్కాలంటే...!

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీరందరూ కలిపితే తెలుగు రాష్ట్రాల జనాభాలో 90 శాతానికి పైగా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక పార్టీగా ఏర్పడి మన ఓట్లు మనమే వేసుకుని అధికారం వైపు పయనిస్తే తప్ప రాజ్యాధికారం అంత సులువు కాదు. అలా కాకుండా ఆయా పార్టీలలో ఉండి రాజ్యాధికారం చేపట్టాలంటే ఆ ముఖ్యమంత్రి పదవి అనేది కలగానే మిగులుతుందేమో. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. దీనిని అనువయించుకొని ముందుకు సాగాలని రాబోయే రోజుల్లో దళిత బహుజన రాజ్యాధికారం రావాలని ఆశిస్తున్నాను.

- కట్ట ప్రశాంత్ కుమార్

93932 57697

Next Story