తెలంగాణ విమోచన దినోత్సవం!

by Disha edit |
తెలంగాణ విమోచన దినోత్సవం!
X

భారతదేశానికంతా 15 ఆగస్టు 1947న స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. కారణం నిజాం నవాబ్. దేశానికి స్వాతంత్య్రం వచ్చాకా కూడా జాతీయ జెండాను నిజాం ఎగురనిచ్చేవాడు కాదు. ఎదురు తిరిగి ఎగరేస్తే నిజాం రజాకార్లకు బలికావల్సిందే. నిజాం రజాకార్లు తెలంగాణ ప్రజలను అనేక అకృత్యాలకు గురిచేశారు.

మహిళలను నగ్నంగా బతుకమ్మలాడించారు. పన్నులు కట్టలేని పేద రైతులను ఎర్రటెండల్లో వంగబెట్టి విపులపై బండలెత్తడం, సలసల కాగే నూనెలో చేతులు పెట్టించడం, బహిరంగంగా ఉరితీయడాలు సామూహిక హత్యలు, దోపిడీలు, మాన భంగాలు ఊర్లపై పడి దోచుకోవడం, ఆడపిల్లలను ఎత్తుకపోవడం, స్త్రీల మాన ప్రాణాలకు భద్రత లేని దుస్థితి లాంటి అనేక దురవస్థలతో తల్లడిల్లినారు. ‘ రైజ్ అండ్ ఫుల్ ఫిల్ మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ’ అనే గ్రంధంలో నిజాం అత్యాచారాలను కండ్లారా చూసిన జూన్ మల్కం అనే మాటలు నాటి నిజాం అకృత్యాలకు దర్పణం పడుతున్నాయి.

నిజాం సైన్యం ఆక‌ృత్యాలు..

ఆ సమయంలో ప్రతి పౌరుడు సర్కారుకు ఇంత డబ్బు చెల్లించవలసిందిగా నిర్ణయించబడేది . దానిని వసూలు చేయడానికి పలు బాధలు పెట్టేవారు. చిత్రహింసలకు గురిచేసేవారు. ఆడ,మగ,దరిద్రుడు, ధనవంతుడు అనే బేధం లేకుండా అందరూ బాధింపబడేవారు. చెవులకు బరువులు, చాతీలపై బండలు పెట్టబడేవి, సలసల కాగే నూనెలో వేళ్ళు ముంచబడేవి . నిజాం ఉద్యోగులను రాక్షస ప్రవృత్తిని సూచిస్తాయి . పరకాల తాలూకాలో 100 మంది ఉద్యమకారులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన సంఘటన ‘ జలియన్ వాలాబాగ్ ’ను తలపిస్తుంది . పెరుమాండ్ల సంకీసలో పన్నులు కట్టని 21 మంది రైతులను కాల్చి చంపినారు. నిజాం రజాకార్లను 3 సార్లు ఉరికించిన బైరాన్ పల్లి వాసులను ఇక్బాల్ ఖాన్ ఆధ్వర్యంలో 92 మందిని, కూటిగల్లలో గ్రామంలో 25 మంది పోరాట యోధులను కాల్చి చంపితే కనీసం దహన సంస్కారాలకు కూడా చేయకుండా శవాలను ఎడ్లబండ్లలో తీసుకెళ్లి పెద్ద బావిలో జార విడిచిన ఘోరకలి తెలంగాణ తల్లి గుండెలను ఇప్పటికి పిండే స్తున్నది. ఏరుపాలెంలో ఇన్స్పెక్టర్ చాందా ఖాన్ ఆధ్వర్యంలో 12 మంది మహిళలపై అత్యాచారాలు చేసి 70 మందిని కాల్చిన ఘటన ఒక మృత్యుహేల.

నల్లగొండ జిల్లా రహీంఖాన్ పేటలో నలుగురిని రజాకార్ల ఆకృత్యాలను ఎదిరించిన రేణికుంట రామిరెడ్డితో సహా ఈ జిల్లాలో 2 వేల మందిని కాల్చి చంపారు . బీబీనగర్లో ఖాసిం రజ్వి నాయకత్వంలో ఆకృత్యాలను పాల్పడుతున్న రజాకార్లను చూసి నవ్విన చిన్నపిల్లలను అక్కడి కక్కడే నరికేసి ఆ ఊరి పైబడి భీభత్సాన్ని సృష్టించారు . షోలాపూర్ దగ్గర మంగోలు గ్రామంలో 43 మంది స్త్రీ పురుషులను చెట్లకు కట్టేసి తుపాకీ మడమలలో చచ్చేంత వరకు కొడుతూ పైశాచికానందాన్ని పొందారు. ‘ సుపరిపాలనా దక్షులైన’ అక్కన్న - మాదన్నలను నైజాం గుండాలు నడి బజార్లలో నరికి చంపారు. పంజాగుట్టలో తల్లీకూతుళ్ళను , సైదాబాద్‌లో 15 మంది స్త్రీలను వాళ్ళ భర్త పిల్లల ముందే చెరిచిన సంఘటనలు వేలాదిగా జరిగాయి.

నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహించిన రాధాకృష్ణ , వేద ప్రకాశ్ ,ధర్మ ప్రకాశ్ , మహా దేవ్ లాంటి యువకులనెందరినో అతికిరాతకంగా రజాకార్లు హత్యలు చేశారు . పండిట్ శ్యామ్ లాల్ కు జైల్లో విషమిచ్చి చంపిన సంఘటనలు చరిత్ర పుస్తకాల కెక్కపోవడం శోచనీయం. నిర్మల్ జిల్లాలో వందలాది మంది ఉద్యమకారులను ఊర్ల మర్రి గా పేరొందిన మర్రిచెట్టు కొమ్మలకు బహిరంగంగా ఉరి తీసిన దుర్ఘటన రజాకార్ల రాజ్యంలో జరిగింది. కొడకండ్ల బ్రాహ్మణులను చెట్టు కొమ్మలకు తలకిందులుగా వేలాడదీసి క్రింద మంట పెట్టి సజీవ దహనం చేసినటువంటి దుర్ఘటనలు వీరి అఘాయిత్యాలకు మచ్చుకు కొన్ని మాత్రమే.

ఇక్కడి డబ్బులతో..ముస్లిం స్కూళ్ళు..

నిజాం పరిపాలనలో పోలీస్ ఉద్యోగిగా ఉన్న రాజాకార్లు అనేక రకాల దుర్మార్గాలకు పాల్పడ్డారు. ముస్లిం ఎకైదార్ అని నినాదంతో తబ్లిగ్ ఉద్యమం జరిపి ఎంతో మంది హిందువులపై దాడులు చేసి ప్రలోభాలకు గురిచేసి ముస్లిం మతంలోకి మార్చారు. అంతే కాదు పట్టణాల, గ్రామాల పేర్లను నిజాంలకు గుర్తుగా మార్చేశారు. ఈ దౌర్జన్యాలను ఎదుర్కోవటానికి ఆర్య సమాజ్,హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభ ఇతర స్వచ్ఛంద సంస్థలు నాటి కాంగ్రెస్ పార్టీలు ఉద్యమించాయి . కానీ దీనిని కూడా కమ్యూనిస్టులే సాగించారని చరిత్ర రాసుకున్నారు . ఆర్య సమాజ్ ఇతర సంస్థలు నిర్వహించిన సాయుధ పోరాటం నిజాం రాజ్యమంత విస్తృతమైంది. 1946 లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన కమ్యూనిస్టులు 1948 లో కుమ్మక్కై భారత ప్రభుత్వ సైనిక దళాలకు వ్యతిరేకంగా పనిచేయడం తెలంగాణ లోకి భారత సైన్యాన్ని రాకుండా అడ్డుకున్నారు వారిపై పోరాటం చేశారు. 1948 సెప్టెంబర్ 17 న నిజాం తొలగిపోవడంతో ఆపాల్సిన సాయుధ పోరాటం 1951 వరకు సాగించడంలో సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరగలేదనేది స్పష్టమవుతుంది. మాతృ భాషలను తొక్కి బలవంతంగా ఉర్దూ భాషలను ప్రజలనెత్తిన రుద్దిన నిజాం జాగీరు ఆదాయమంతా తన కుటుంబ ఖర్చులకేనని పాఠశాలలు ఏర్పర్చడానికి వీల్లేదని ఉత్తరుపు జారీ చేశాడు. నేనా దృక్పథంతో ఆర్య సమాజ్ ఏర్పాటు చేసిన పాఠశాలలనన్నింటిని నిజాం మూసే యించాడు. కాగా తెలంగాణ ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులతో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, జామ మసీదులో బండలు పరిపించడానికి అందాల, కాన్పూర్ లాంటి చోట్ల ముస్లిం హైస్కూళ్ళ ఏర్పాటుకు పంపేవారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు 1938 లో ఉద్యమాలు ఊపందు కొన్నాయి . 1938 జూన్ నుంచి కొన్ని నెలల పాటు ఆర్య సమాజ్ నేతృత్వంలో సత్యాగ్రహం జరిగింది . 12 వేల మంది అరెస్టయ్యారు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాటతో..ఉద్యమానికి ఊపు

1938 నవంబర్ 29 నుండి డిసెంబర్ 24 వరకు స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో సత్యాగ్రహం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులెందరినో ప్రభుత్వం డిబార్ చేసింది . నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లను నిజాం హైదరాబాద్‌లోకి రానివ్వలేదు. నిజాం పాలనకి అంతమొందించడానికి ప్రజలు త్యాగాలకు వెనుకాడరు. వృద్ధులు ,పిల్లలు,చంటి పిల్లలు,తల్లులతో సహా ప్రతి పల్లె కదన రంగం లోకి దుమికింది. ఒడిశాలలో రాళ్ళలతో, ఒడిలో కారం పొడితో ప్రారంభమైన ఉద్యమం రణరంగంగా మారింది. 1947 సెప్టెంబర్ 7న నిజాం అకృత్యాలపై నెహ్రు పార్లమెంట్లో ప్రకటన చేశారు. అయినప్పటికి ఓట్ బ్యాంక్ రాజకీయాల కారణంగానే నిజాంపై సైనిక చర్యకు అనుమతించకపోవడం దురదృష్టకరం, నిజాం రజాకార్లు ఉద్యమకారులపై తూటాల వర్షం కురిపించారు. "బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లో వస్తువు కొడుకో ! నైజాం సర్కారోడా ! లాంటి పాటలు ఉద్యమాన్ని మరింత ఊపందుకునేలా చేశాయి. తెలంగాణ ప్రజల వీరత్వానికి సర్దార్ పటేల్ చొరవతో అక్కడ జరిగిన పోలీస్ యాక్షన్ మరియు భారత సైన్యం చర్యల కారణంగా నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ ప్రజలకు నిజాం నికృష్టపు పాలన నుండి విమోచనం కలిగింది . తెలంగాణ ప్రజల వీరత్వానికి సర్దార్ పటేల్ వీరత్వం తోడుకావడంతో 17 సెప్టెంబర్ 1948 న తెలంగాణ విముక్తమైంది. ప్రతి పల్లె పోరాట చరిత్రకు సాక్షిగా నిలబడింది 17 సెప్టెంబర్ 1948 న తెలంగాణ రావడం జరిగింది.

అటకారి గిరీష్

ఏబీవీపీ

9666816132



Next Story