పోరాట యోధులు:ఉరిని ముద్దాడిన రాంజీగోండు

by Disha edit |
పోరాట యోధులు:ఉరిని ముద్దాడిన రాంజీగోండు
X

రోహిల్లాల తుది తిరుగుబాటు 1860 మార్చి , ఏప్రిల్ నెలలలో జరిగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్‌వారి దౌర్జన్యాలతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలతో పాటు 500 పైగా గోండులు విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి కదనరంగానికి సిద్ధమయ్యారు. నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశాయి. అడవంతా తుపాకుల మోత మారుమోగింది. సంప్రదాయక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసీలు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసీలను బ్రిటిష్ సైన్యాలు కాల్చిచంపాయి. కడదాకా పోరాడిన రాంజీగోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న 'ఊడల మర్రి'కి 1860 ఏప్రిల్ 9న ఉరి తీశారు.

భారత ప్రథమ స్వాతంత్ర్య పోరాటం అంటే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతంలోని గోండ్వానా ప్రాంతంలో గిరిజనుల పరిపాలన కనిపిస్తుంది. ఆనాడు గోండ్వానాలో భాగంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల (గోండుల) నాయకత్వంలోనూ పోరాటం కొనసాగింది. రాంజీ గోండు (1838-60) ఆధ్వర్యంలో ' రోహిల్లా తిరుగుబాటు' కుమరంభీమ్ (1938-40) చేసిన 'జోడేఘాట్ తిరుగుబాటు' దేశంలో ఆదివాసీల తొలి చారిత్రక పోరాటాలుగా నిలిచాయి.

రాంజీగోండు స్మరణకు ఆనవాళ్లు కూడా లేకపోవడం పాలకుల వివక్షకు నిదర్శనం. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నివసించే అనేక గిరిజన తెగలలో ప్రధానమైనది గోండు తెగ. మధ్యప్రదేశ్‌లో నివసించే గోండులలో మురియాగోండ్, మారియా గోండు ఉప తెగలు. మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశాలో రాజ్ గోండు, దుర్వుగోండు ఉప తెగలుగా ఉన్నాయి. వీరినే ' కోయత్తోర్ ' అని కూడా పిలుస్తారు.

రాజులుగా ఉంటూనే

గోండుల పరిపాలన క్రీ.శ. 1240 నుంచి-1750 వరకు సుమారు ఐదు శతాబ్దాల పాటు సాగింది. గోండ్వానా రాజ్యాన్ని భీం బలాల్‌సింగ్ వార్ధా నది పక్కన ఉన్న సిర్పూర్ (టి) రాజధానిగా చేసుకొని పాలించాడు. తర్వాత అతని వారసులు బలాల్ సింగ్, హెర్సింగ్, తల్వార్ సింగ్, కేర్‌సింగ్, రాంసింగ్, సూర్జా బలాల్ సింగ్ పాలన సాగించారు. సూర్జా బలాల్ సింగ్ ఢిల్లీ సుల్తానులతో యుద్ధం చేసి విజయం సాధించారు. దీంతో సుల్తానులు గోండ్వానాలోని దక్షిణ మండలంతో పాటు 'షేర్‌షా' బిరుదును సూర్జా బలాల్ సింగ్‌కు కానుకగా ఇచ్చారు. అందుకే గోండు రాజులు తమ పేరు చివర సింగ్‌కు బదులుగా 'షా' అని పెట్టుకున్నారు.

సూర్జా బలాల్ సింగ్ తనయుడు ఖందియా బలాల్ షా రాజధానిని సిర్పూర్ (టి) నుండి చంద్రాపూరుకు మార్చాడు. తొమ్మిది మంది గోండు రాజులలో చివరివాడైన నీల్ కంఠ్ షాను మరాఠీలు బందీ చేసి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం క్రీ.శ. 1750-1802 వరకు మరాఠీల ఆధీనంలోకి వెళ్లింది. మరాఠీ రాజులు బ్రిటిష్‌వారికి తలొగ్గి గోండ్వానాను వారికి అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై ఆంగ్లేయుల, నిజాముల పాలన ఆరంభమైంది. ఈ పాలకుల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా అనేక గిరిజన తిరుగుబాటు ఉద్యమాలు ఒక్కొక్కటిగా ఆరంభమయ్యాయి.

రాంజీగోండు సారథ్యంలో

ఆదిలాబాద్ జిల్లాలోని గోండులలో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్ల రాంజీగోండ్ 1838-1860 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈయన తొలి గిరిజన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో పోరాటంలో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే, రావుసాహెబ్ తమ బలగాలతో విడిపోయారు. తాంతియా తోపే నర్మదా నది దాటి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించడానికి యత్నించారు. నిజాము నిరాకరించడంతో తాంతియా తోపే తమ దారిని మార్చుకుని, రోహిల్లా సిపాయిలతో కలిసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. రోహిల్లా సిపాయిలు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్ ప్రాంతాలను పోరాట కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నారు.

రోహిల్లాల నాయకుడిగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని, బ్రిటిష్‌వాళ్లను తరిమేసేందుకు పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణ, ప్రజలను ఉత్తేజితులను చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ రంగారావు అండమాన్ జైలులో 1860లో మరణించాడు. ఆ తర్వాత రోహిల్లాల తిరుగుబాటు రాంజీ గోండు నాయకత్వంలో తీవ్ర రూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కొలాము, కోయ తెగల గిరిజనులుండే ప్రాంతం. రాంజీ గోండు సారథ్యంలో రోహిల్లా సిపాయిల తిరుగుబాటుగా మారింది.

మర్రి చెట్టుకు ఉరేసి

రోహిల్లాల తుది తిరుగుబాటు 1860 మార్చి , ఏప్రిల్ నెలలలో జరిగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్‌వారి దౌర్జన్యాలతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలతో పాటు 500 పైగా గోండులు విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి కదనరంగానికి సిద్ధమయ్యారు. నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు.

నిర్మల్ కలెక్టర్, కల్నల్ రాబర్ట్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశాయి.అడవంతా తుపాకుల మోత మారుమోగింది. సంప్రదాయక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసీలు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసీలను బ్రిటిష్ సైన్యాలు కాల్చిచంపాయి. కడదాకా పోరాడిన రాంజీగోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న 'ఊడల మర్రి'కి 1860 ఏప్రిల్ 9న ఉరి తీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు 'వెయ్యి ఉరిల మర్రి' గా ప్రసిద్ధి చెందింది.

( నేడు రాంజీగోండు వర్ధంతి)





గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

94913 18409



Next Story

Most Viewed