ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

by Disha edit |
ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే
X

జీవించడమంటే కేవలం బతకడం కాదు ఆరోగ్యంగా ఉండటమని అర్థం. దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. అందుకే రాజ్యాంగంలోనూ ఈ హక్కును కల్పించారు. అయితే రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కును ప్రభుత్వాలు సరిగా అమలు పరచడం లేదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2002 జాతీయ ఆరోగ్య పథకాన్ని 2017లో కొంత మార్పులు చేర్పులు చేసి జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించారు. మరోసారి ఆ పథకాన్ని మార్పులు చేసి 2018లో ఆయుష్మాన్ భారత్ పథకంగా మార్చారు. ఆరోగ్య పథకాలు అనేక రకాలుగా మార్చిన దేశ ప్రజల ఆరోగ్యం నానాటికీ కృంగిపోయి ఆరోగ్య సూచీలు నానాటికీ దిగజారిపోతున్నాయి.

కేటాయింపులు తక్కువ..

వైద్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ దేశ జీడీపీలో 1.15 శాతం మాత్రమే. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని కాలం గడుపుతున్నాయి ప్రభుత్వాలు. కానీ గడచిన సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైన ఆరోగ్య రంగానికి 1.2 శాతానికి మించలేదు. కానీ ఇతర దేశాల్లో ఈ రంగానికి 4.9 శాతం కేటాయిస్తారు. ఇతర దేశాల కేటాయింపులతో పోల్చితే ఈ కేటాయింపు సగం కంటే తక్కువగా ఉండటం బాధాకరం.

సాధారణంగా బ్రాండెడ్ ఔషధాలను తయారుచేసే కంపెనీలే జనరిక్ మందులను కూడా ఉత్పత్తి చేస్తుంటాయి. బ్రాండెడ్ మందుకి జనరిక్ మందుకి వాటి నాణ్యత ప్రమాణాలలో పనితీరులో ఎలాంటి తేడా ఉండదు. కానీ ధరలలో 300 శాతం నుంచి 1000 శాతం వరకు తేడా ఉంటుంది. జనరిక్ మందు 2 రూపాయలు ఉంటే బ్రాండెడ్ మందు 40 రూపాయలుగా ఉంటుంది. దీనివల్ల అమ్మకందారులు జనరిక్ మందులపై దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ బ్రాండెడ్ మందులు కొనేలా చేసి భారీ స్థాయిలో దోపిడీ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం వైద్యుల నిష్పత్తి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచడం లేదు. నేటికి దేశంలో లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. ఈ సిబ్బందితో వైద్య ఆరోగ్య రంగం బలోపేతం కష్టమవుతుంది.

ప్రభుత్వ వ్యవస్థలే కాపాడాయి

ప్రస్తుతం మన దేశంలో ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు దాదాపు 85 శాతం కార్పొరేట్ వైద్య వ్యవస్థలే ఆధారంగా మారిపోయాయి. అనేక కార్పొరేట్ సంస్థలు వైద్య రంగంలో ప్రవేశించి వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసినవి. అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు రాయడం, మందుల రేట్లు 300 నుంచి 1000 శాతం వరకు అదనంగా అమ్మడం డాక్టర్ల ఫీజు కింద లక్షలాది రూపాయల వసూల్ చేయడం మొదలైన చర్యలతో ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చుతున్నారు. తత్ఫలితంగా మిగిలున్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు రోజురోజుకు దిగజారిపోతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచీకరణ వలన ప్రజారోగ్య రంగంలోకి ఆరోగ్య బీమా కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. వాటికి ఎంతోమంది ప్రీమియంలు కడుతున్నారు. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యత కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఆరోగ్య బీమా పథకాలు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు. నిజానికి ప్రభుత్వాలు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయాలి కానీ ఇలాంటి ఆరోగ్య బీమా పథకాలు తెచ్చి ప్రజల జీవితాలను ప్రవేటు వ్యక్తుల చేతిలో పెట్టరాదు.

అప్పుడే ఆరోగ్య భారతం సాధ్యం

దేశంలో ఎన్నో తీవ్రమైన వ్యాధులకు, ఆరోగ్య విపత్తులను ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు మాత్రమే ప్రజలను కాపాడాయి. అంతెందుకు కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది ఎక్కువ శాతం ప్రభుత్వ వ్యవస్థలే. అందుకే వైద్య ఆరోగ్య రంగాన్ని జాతీయికరణ చేయాలి. అందులో భాగంగా భారత ప్రజలందరికీ ఆరోగ్యాన్ని హక్కుగా చట్టబద్ధత కల్పించాలి. అలాగే కార్పొరేట్ వైద్యశాలల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. డాక్టర్ల ఫీజులు, వైద్య పరీక్షల ధరలు, మందుల ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలి. ఉల్లంఘించిన వైద్యశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కమిటీలు సూచించినట్లు ఆరోగ్య బడ్జెట్‌ను దేశ జీడీపీలో కనీసం 10 శాతం కేటాయించాలి. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి ఆరోగ్య భారతంగా దేశాన్ని రూపొందించాలి.

దండంరాజు రాంచందర్ రావు

9849592958



Next Story

Most Viewed