24 ఫ్రేమ్స్:ఒరియన్ మూవీ 'అల'వరింత

by Disha edit |
24 ఫ్రేమ్స్:ఒరియన్ మూవీ అలవరింత
X

సుదీర్ఘ సినిమా నిర్మాణ చరిత్ర ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లేకపోవడంతో ఒడిశా సినిమా అటు వ్యాపార సినిమాగాకానీ, ఇటు అర్థవంతమైన సినిమాగాకానీ ఎదగలేకపోయింది. నిధుల లేమి, సాంకేతిక కొరత, హిందీ సినిమా ప్రభావం లాంటి ప్రతికూల అంశాలున్నప్పటికీ కొంత మంది చలనచిత్రకారులు స్వతంత్రంగా మంచి ప్రయత్నాలు చేశారు. వారికి అండగా రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఒడిశాలో నిర్వహించబడుతున్నాయి. 2004 నుంచి పూరిలో నిర్వహించబడుతున్న 'బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్' BYOFF ఒక ప్రధాన వేదిక. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దర్శకులకు ఎలాంటి నిబంధనలు ఉండవు. ఎలాంటి ముందస్తు పరిశీలనలు ఉండవు. ఎంపిక ప్రహసనాలుండవు. డైరెక్టర్లు మాత్రమే కాదు, సినిమాకు సంబంధించి నటులు, సాంకేతిక నిపుణులు ఎవరయినా నేరుగా నమోదు చేసుకొని తమ సినిమాలను ప్రదర్శించే వీలుందిక్కడ. ఇది దేశవ్యాప్త చలనచిత్రకారులను ఒక చోటకు చేర్చుతుంది. అదొక గొప్ప వేదిక.

దేశంలోని అన్ని ప్రాంతీయ సినిమాలలాగే ఒలీవుడ్‌గా పిలువబడే ఒరియన్ సినిమా కూడా హిందీ సినిమా ఉప్పెనలో కొట్టుకుపోతున్నది. 1990లలో టీవీతో ప్రభావితమైన ఒరియన్ సినిమాల నిర్మాణం విపరీతంగా తగ్గిపోయింది. 1999లో వచ్చిన తుఫాను ఒడిశాలోని అన్ని రంగాలను అతలాకుతలం చేసినట్టుగానే అక్కడి సినిమానూ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నిబద్ధత కలిగిన దర్శకుల చొరవ, కృషి ఫలితంగా తిరిగి పుంజుకుంది. 2000 సంవత్సరం తర్వాత ఒరియన్ సినిమాల నిర్మాణం గణనీయంగా పెరిగింది.

ఇప్పుడక్కడ నిర్మాణమవుతున్న సినిమాలలో అధిక శాతం హిందీ, తెలుగు, బెంగాలీ సినిమాల రీమేక్‌లే. నిర్మాతలు కూడా అధిక శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో మొత్తంగా ప్రస్తుతం ఒరియన్ సినిమా పెద్ద వ్యాపార రంగంగా మారిపోయింది. అయితే, ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఎదిగి వస్తున్న యువతరం నుంచి భవిష్యత్తులో మంచి సినిమాలను ఆశించవచ్చు. ఒరియన్ సాహిత్యమనగానే సీతాకాంత్ మహాపాత్ర, ప్రవాసిని మహాకుడ్ ఇలా అనేక మంది సృజనకారులు గుర్తుకు వస్తారు. ఒడిశా సినిమా కూడా నేలమీదికి దిగి తనదైన సాంస్కృతిక సామాజిక నేపథ్యమున్న సినిమాలకు వేదికగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.

ఘనమైన చరిత

సుదీర్ఘ సినిమా నిర్మాణ చరిత్ర ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లేకపోవడంతో ఒడిశా సినిమా అటు వ్యాపార సినిమాగాకానీ, ఇటు అర్థవంతమైన సినిమాగాకానీ ఎదగలేకపోయింది. నిధుల లేమి, సాంకేతిక కొరత, హిందీ సినిమా ప్రభావంలాంటి ప్రతికూల అంశాలున్నప్పటికీ కొంత మంది చలనచిత్రకారులు స్వతంత్రంగా మంచి ప్రయత్నాలు చేశారు. వారికి అండగా రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఒడిశాలో నిర్వహించబడుతున్నాయి. 2004 నుంచి పూరిలో నిర్వహించబడుతున్న 'బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్' BYOFF ఒక ప్రధాన వేదిక.

ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు దర్శకులకు ఎలాంటి నిబంధనలు ఉండవు. ఎలాంటి ముందస్తు పరిశీలనలు ఉండవు. ఎంపిక ప్రహసనాలుండవు. డైరెక్టర్లు మాత్రమే కాదు, సినిమాకు సంబంధించి నటులు, సాంకేతిక నిపుణులు ఎవరయినా నేరుగా నమోదు చేసుకొని తమ సినిమాలను ప్రదర్శించే వీలుందిక్కడ. ఇది దేశవ్యాప్త చలనచిత్రకారులను ఒక చోటకు చేర్చుతుంది. అదొక గొప్ప వేదిక. ఇక 'ఫిల్మ్ సొసైటీ ఆఫ్ భువనేశ్వర్' నిర్వహిస్తున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ భువనేశ్వర్' మరో వేదిక. గత దశాబ్దానికి పైగా ఈ ఫెస్టివల్ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది. ఇలా మంచి సినిమా వివిధ భాషల 'మాహోల్' ఒరియన్ సినిమాకు ప్రేరకంగా నిలుస్తున్నది.

ఉనికిని నిలుపుకుంటూ

ఇలా ఒరియన్ సినిమా చిన్న సంఖ్యలోనూ, స్వల్ప గొంతుతోనూ తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది. ఒరియన్‌లో మొదటి సినిమా 'సీతా బిబాహ్' 1936లో విడుదలైంది. మోహన్ సుందర్ దేవ్ గోస్వామి ఆ సినిమాను రూపొందించాడు. ముప్పయి వేల రూపాయల బడ్జెట్‌తో కామపాల మిశ్రా నాటకాన్ని సినిమాగా తీశారు. ఆర్థికంగా ఘన విజయం సాధించింది. 1951 వరకు రెండవ సినిమా రాలేదు. 1960లో ప్రఫుల్ల సేన్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ లోకేనాథ్' జాతీయ అవార్డును అందుకుంది. అదే యేడు ఒరియా సినిమా విశిష్ట స్థానాన్ని పొందిన నటుడు ప్రశాంత నందా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. 1966,1969 లో కూడా ఉత్తమ నటుడి బహుమతులు అందుకున్నాడు.

ఒడిశా సినిమాలలో మహమ్మద్ మోసిన్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'పూలా చందన' లాంటి 16 సినిమాలను ఆయన రూపొందించాడు. తర్వాత అమియా రంజన్ పట్నాయక్, రాజు మిశ్రా, అక్షయ్ మోహన్తీ, బీజయ్ మోహన్తీ, ఉత్తమ్ మోహన్తీ లాంటి వారు సినిమాలను తీశారు. వారిలో అమియా రంజన్ పట్నాయక్ ఒరియా, బెంగాలీ, బంగ్లా మూడు భాషలలో సినిమాలు రూపొందించాడు. కాలక్రమేణా ఒరియన్ సినిమా ఆ మాత్రపు ప్రాభవాన్ని కూడా కోల్పోయింది. ఒడియా భాషా సంస్కృతులకు ప్రతిబింబాలుగా వుండాల్సిన ఒడియా సినిమాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. నిర్మాతల అతి ప్రమేయం, సాంకేతిక వసతుల కొరతలాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

అవార్డులు అందుకుంటూ

ప్రతికూల పరిస్థితులలోనూ ఒడిశా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్న సినిమాలు వచ్చాయి. దర్శకులూ వచ్చారు. వారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సినవాడు నీరద్ మహాపాత్ర. 1974లో భువనేశ్వర్‌లో ఫిల్మ్ సొసైటి స్థాపించి అంతర్జాతీయ సినిమాని ఒడిశాకు పరిచయం చేశాడు. సినిమాకు సంబంధించి ఆయన పాఠాలు మరిచిపోలేనివని విద్యార్థులు చెబుతారు. 1983లో ఆయన తన మొదటి సినిమా 'మాయా మిర్గా' రూపొందించాడు. కాలక్రమంలో సమిష్టి కుటుంబాలలో జరిగే మార్పులను అత్యంత సహజంగా చూపించారు. లండన్, కేన్స్, లోకార్నోలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. తర్వాత నీరద్ అనేక డాక్యుమెంటరీలు తీశాడు. పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన మన్మోహన్ 1975లో తన మొట్టమొదటి సినిమా 'సీతారాఠీ' రూపొందించాడు. ఛాందస లోకానికి ఎదురొడ్డి నిలిచిన ఒక మహిళ గాథను ఆ సినిమా ఆవిష్కరించింది.

1984లో తీసిన ' నీరభ్ జద్ధ' (నిశబ్ద తుఫాన్) ఒక గ్రామంలో భూస్వామికీ, రైతుకూ నడుమ జరిగే సంఘర్షణని చిత్రించింది. ఆ తర్వాత క్లాన్తా అపర్ణ హా, అందా దిగంతాలాంటి మంచి సినిమాలు తీశాడు. ఏకే బీర్ 1969-70 లో పూనాలో సినిమాటోగ్రఫీ డిప్లొమా పూర్తిచేశాడు. '27 డౌన్' సినిమా‌తో కెరీర్ ఆరంభించాడు. బి. నర్సింగరావు తీసిన 'దాసి'కి జాతీయస్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డుని అందుకున్నాడు. 'మావూరు' డాక్యుమెంటరీకి కెమెరా బాధ్యతలను నిర్వహించి ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అవార్డును అందుకున్నాడు. అటెన్‌బరో 'గాంధీ' సినిమాకు కూడా పనిచేశాడు. తర్వాత దర్శకుడిగా మారి 'ఆదిమీమాంస' 'లావణ్య ప్రీతి' 'అరణ్యక' ' శేష దృష్టి' సినిమాలు తీశాడు. నందితాదాస్ ఫైర్, ఎర్త్, భవిందర్, కంలీ, ఫిరాఖ్‌లాంటి 40కి పైగా సినిమాలలో నటించి అనేక అవార్డులను అందుకుంది. 'ఫిరాఖ్' తో దర్శకురాలిగా మారింది. ఒడిశా చలనచిత్ర సీమలో మంచి దర్శకుడిగా నిలిచినవాడు సుశాంత్ మిశ్రా. ఇలా ప్రభుత్వ సహకారం లేకుండానే ఒడిశా సినిమా తన తన గొంతును వినిపిస్తూనే ఉంది.

వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed