కథా సంవేదన: పెంపకం

by Disha edit |
కథా సంవేదన: పెంపకం
X

ఇందిరాపార్క్‌లో కొన్ని గమ్మత్తైన దృశ్యాలు కన్పిస్తూ ఉంటాయి. పావురాలకి ఆహార ధాన్యాలు వేస్తూ కొంతమంది కన్పిస్తూ ఉంటారు. అక్కడ వున్న చిన్న చెరువులో చేపలకి బ్రెడ్ ముక్కలు వేస్తూ మరికొందరు కన్పిస్తూ ఉంటారు. ఇంకా కొందరు చెట్టు మొదళ్లలో చిన్నచిన్న పురుగుల కోసం, చీమల కోసం పిండిని వేస్తూ కన్పిస్తూ ఉంటారు. ఏదో పుణ్యం మూట కట్టుకుందామని వాళ్లు ఆ విధంగా చేసేవారు. వీళ్లని చూస్తున్నప్పుడల్లా నాకు మా చిన్నప్పుడు మా అమ్మకి, మా పనివాడు లక్ష్మిరాజంకి జరిగిన ఓ సంభాషణ గుర్తుకొస్తుంది.

మా ఇంటి వెనుక చిన్న పెరడు వుండేది. అక్కడ చిన్న చెట్లను పెట్టి, వాటికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఎరువులని వేసేవాడు మా లక్ష్మిరాజం. అతనికి పన్నెండు సంవత్సరాలు వుంటాయి. పనిచేసేవాడు. మాతో పాటు బడికి వచ్చేవాడు. వాటికి నీళ్లు కూడా ఎక్కువగా పట్టేవాడు. అయినా అవి ఎక్కువకాలం బతికేవి కావు. చిన్న వానకే వాటి వ్రేళ్లు బయటకి వచ్చేవి. అది చూసి మా లక్ష్మిరాజం బాగా నిరుత్సాహపడేవాడు. మా అమ్మ ఈ విషయం గమనించింది. చివరికి ఓ రోజు మా లక్ష్మిరాజం ఈ విషయం గురించి మా అమ్మని అడిగాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని.

అప్పుడు మా అమ్మ చాలా గమ్మత్తైన సమాధానం చెప్పింది. అది గమ్మత్తుకన్నా చాలా తెలివిగా, చాలా అనుభవంతో చెప్పినట్టు అన్పించింది. ‘ఈ మొక్కలకి అవసరమైన వాటికన్నా ఎరువులని, నీళ్లను ఎక్కువగా ఇస్తున్నావు. అందుకని అవి భూమి లోపలికి తమ వ్రేళ్లని పంపించడం లేదు. చిన్న గాలికే, చిన్న వర్షానికే అవి పడిపోతున్నాయి. వాటి వ్రేళ్లు బయటకు వస్తున్నాయి. ఇంత అవసరం లేదు’ అంది అమ్మ. లక్ష్మిరాజం ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ రోజు నుంచి తక్కువ నీళ్లని పట్టడం మొదలు పెట్టాడు. అవి కాస్తా ఆరోగ్యంగా కనిపించడం మొదలుపెట్టాయి. నా చిన్నప్పుడు ఆ మాటలలోని పరమార్థం అర్థం కాలేదు. కానీ పెద్దగా అయిన తరువాత ఆ విషయం చాలా బోధపడింది.

పిల్లలని పెంచే క్రమంలో ఆ విషయం చాలా స్పష్టమైంది. మా పిల్లలకి అవసరమైన వాటిని ఎక్కువగా నేనే అందుబాటులో వుంచేవాణ్ని. నేనే కాదు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పనే ఇది. వాళ్లు ఏ మాత్రం శ్రమకు లోనుకాకుండా అన్నీ నేనే ఇచ్చేవాన్ని. మా ఆవిడ కూడా అలాగే చేసింది. దానివల్ల అన్నింటికి మా పిల్లలు మా పైన ఆధారపడటం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని గ్రహించి మా పద్దతులని మార్చుకున్నాం. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత మెల్లిమెల్లిగా అలవాటు పడిపోయారు. స్వతంత్రంగా పని చేసుకోవడం మొదలుపెట్టారు. మా అమ్మకీ మా లక్ష్మిరాజంకి మధ్య జరిగిన సంభాషణ నాకు చాలా సార్లు గుర్తుకొచ్చేది. దాన్ని నా జీవితానికి అన్వయించుకున్నాను. దాని వల్ల పిల్లలు స్వతంత్రులు అయినారు.

ఎవరికైనా కొంత సహాయాన్ని అందించవచ్చు. అలాగే మన పిల్లలకి కొంత సహకారాన్ని అందించవచ్చు. అంతేకానీ అంతా మనమే అయి చేయకూడదని అర్ధమయ్యింది. వాళ్లకి వాళ్లు ఎదగడానికి అవకాశం కల్పించాలి. మన ప్రేమతో వాళ్లని పరాన్న జీవులని చేయకూడదు. అదే పని నేను చేసాను. పిల్లలు ఎదిగారు అలాగే.

మా అమ్మ చెప్పిన విషయం ఆ కాలంకన్నా ఇప్పుడు ఎక్కువగా అన్వయించాల్సి ఉంటుందని అన్పిస్తుంది. చెట్లు, పక్షుల విషయంలోనే కాదు. అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. ఇందిరాపార్కులో పాదచారులు చేస్తున్న పని కూడా సమంజసంగా అన్పించడం లేదు. జీవన వైవిధ్యానికి దోహదం చేసే విధంగా వాళ్ల పని లేదని అన్పిస్తుంది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed