రాష్ట్ర విద్యారంగానికి నిధులు దక్కేనా!

by Disha edit |
రాష్ట్ర విద్యారంగానికి నిధులు దక్కేనా!
X

దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే పురుడుపోసుకుంటుంది. దేశ విద్యా వ్యవస్థకు ఉన్నత విద్య ఆకాశ హర్మ్యమైతే పాఠశాల చదువుకోవడానికి పునాది వంటిది. ఈ రెండింటికీ సమతూకంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధించగలం. తెలంగాణలో విద్యాసంస్థలు నాణ్యత ప్రమాణాలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థికపరమైన ప్రోత్సాహం ఎంతో అవసరం. కానీ గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధుల కేటాయింపు లేక మౌలిక వసతుల కల్పన, నైపుణ్య శిక్షణ, నాణ్యమైన విద్య నేలబారుగా మారింది. నూతన విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు లేక, నవోదయ, సైనిక విద్యాలయాల స్థాపన జరగక ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత తీరక, నాణ్యమైన చదువు నేతిబీరకాయ చందంగా మారింది.

అత్తెసరు నిధుల కేటాయింపు..

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టింది. ఈ ఏడాదైనా కరోనా వల్ల దెబ్బతిన్న విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. కరోనా సమయంలో ఆత్మనిర్భర్ పథకలంటూ విద్యారంగానికి ఎక్కువగా కేటాయింపులు జరగలేదు. ఈ రంగానికి కనీసం బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ నుండి నూతన జాతీయ విద్యా విధానం-2020 వరకు ప్రతిది ప్రతిపాదించినా అత్తెసరు నిధుల కేటాయింపులతో విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. పాఠశాల కళాశాల విద్యలో మౌలిక వసతుల కల్పన కోసం, యూనివర్సిటీల అభివృద్ధి కోసం, పరిశోధనల సాంకేతికకు, ఆన్లైన్ విద్యకు మధ్యాహ్న భోజనానికి, ఉపాధ్యాయ విద్యకు కేటాయింపులు భారీగా పెంచితే ప్రతి రాష్ట్రంలో విద్యా వికాసం నిరంతరం నిర్విఘ్నంగా సాగుతూ జాతి భవితకు దిక్సూచిలా నిలుస్తుంది.

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లల కోసం ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా నవోదయ పాఠశాలలను స్థాపించింది కేంద్ర ప్రభుత్వం. ఇవి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో ఉన్నా ఇంకా 23 జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను నింపాల్సిన అవసరం ఉంది. అలాగే విభజన హామీ మేరకు తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు 2017లోనే ఆమోదం తెలిపిన ఇంతవరకు నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్‌లోనైనా నవోదయ, సైనిక్ పాఠశాలల ఏర్పాటుకు ఉపాధ్యాయుల నియామకానికి నిధులు కేటాయించాలి.

యూనివర్సిటీలకు సైతం..

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మూడు దశల్లో పాఠశాలలోని పన్నెండు విభాగాలను పట్టిష్ట పరిచేందుకు కంకణం కట్టుకుంది. దీనికోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, సమగ్ర శిక్ష అభియాన్ నిధులు కేటాయించినది. ప్రస్తుతం కొన్ని బడుల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా ప్రభుత్వ బడులలో అదనపు గదుల నిర్మాణం, డిజిటల్ విద్య, త్రాగునీరు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, విద్యుదీకరణ మొదలైన పనుల కోసం కేంద్రం నుండి ఆర్థిక తోడ్పాటు అవసరం. కావున ప్రభుత్వ బడుల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి బడులను బలోపేతం చేయాలి. అలాగే యూనివర్సిటీలకు సైతం కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు జరపాలి.

రాష్ట్రం కోఠి మహిళా కళాశాలను మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే విభజన హామీ మేరకు గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు. అలాగే దేశంలో మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐఎం నెలకొల్పవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విశ్వవిద్యాలయాలు ప్రత్యేక గుర్తింపుకు నోచుకోకుండా పోతున్నాయి. అంతేకాదు విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం విద్యార్థులకు తగిన నైపుణ్యాలు లేకుండా పోతున్నాయని మానవ వనరుల శాఖ అభిప్రాయపడింది. ఈ విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేసినప్పుడే ప్రపంచ స్థాయి చదువులతో పోటీపడగలుగుతుంది.

అంకం నరేష్

6301650324

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

బడ్జెట్లో బొగ్గు పెన్షనర్లకు మొండిచేయి




Next Story

Most Viewed