జాతీయ విధానం లేని పార్టీ

by Disha edit |
జాతీయ విధానం లేని పార్టీ
X

‘కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్’ నినాదంతో దేశ ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరిన కే‌సీ‌ఆర్, దానికి తగ్గట్టుగా పార్టీ పేరును సైతం ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్)గా మార్చి విఫలయత్నం చేశారు. ఈ పేరు మార్పుతో టి(బి)‌ఆర్‌ఎస్ పార్టీ దేశమంతా సులువుగా విస్తరిస్తుందని, ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికారు. కానీ తెలంగాణ కోసం పుట్టిన టి‌ఆర్‌ఎస్, యువతను పట్టిపీడుస్తున్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోక పోవడం వల్ల, మూడోసారి సొంత రాష్ట్రంలో అధికారం దక్కించుకోలేకపోయింది. బీఆర్‌ఎస్ ఇప్పటికీ తన జాతీయ విధానాలు వెల్లడించలేకపోవడం వల్ల, అది ఏ సిద్ధాంతం లేని ఒకే ఒక పార్టీగా చరిత్రలో మిగిలిపోనుంది.

భారతదేశాన్ని 75 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేవని, వాటి పని అయిపోయిందని జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు బీఆర్‌ఎస్ అధినేత. తమ నాయకత్వంలో కేవలం ఒక దశాబ్ద కాలం లోపే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, అందువల్ల ‘తెలంగాణ మోడల్’ అన్ని రాష్ట్రాల్లో రావాలని ఊదరగొట్టాడు. దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసమే బి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టారని చెబుతున్న నాయకత్వం, దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ, ప్రాంతీయ తత్వానికి తావులేకుండా వారు జాతీయ స్థాయిలో అనుసరించబోయే విధానాలను ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందే జాతీయ మీడియా ముందు వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశ ప్రజలందరికీ, దేశ ప్రగతి కోసం తెలంగాణలో పుట్టిన మరో జాతీయ పార్టీ పనిచేస్తున్నదని తెలుస్తుంది.

కొత్త రాష్ట్రాలపై నోరు మెదపరేం!

తెలంగాణ ఉద్యమ సమయంలో ‘చిన్న రాష్ట్రాల జాతీయ కూటమి’ కన్వీనర్ గా ఉన్న కే‌సి‌ఆర్, ఇప్పటివరకు కొత్త రాష్ట్రాల ఊసేత్తలేదు. మనదేశంలో పూర్వాంచల్, పశ్చిమ యూ‌పి (హరితప్రదేశ్), బుందేల్ఖండ్, కఛ్, సౌరాష్ట్ర, కోసల, మిథిల, గోర్ఖాలాండ్, విదర్భ, మరాట్వాడా, ఉత్తర కర్ణాటక, కొంగునాడు, మొదలైన రాష్ట్రాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే ప్రాంతీయ అసమానతలు రూపుమాపడానికి, పెరుగుతున్న జనాభా, ప్రజల నుండి వచ్చే డిమాండ్, అక్కడి సహజ వనరులను బట్టి పరిపాలన వికేంద్రీకరణకు బి‌ఆర్‌ఎస్ తన విధానాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇతర జాతీయ పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని తప్పక వెల్లడిస్తాయి. మరోవైపు దేశ రక్షణ దృష్ట్యా హైదరాబాద్ దేశ రెండో రాజధాని అయితే బాగుంటుందని కొన్ని పార్టీల నాయకులు, కొందరు మేధావులు, రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్,ఐపీ‌ఎస్‌లు, బ్యూరోక్రాట్లు అంటున్నారు. ఈ విషయాన్ని డా. బి.ఆర్. అంబేద్కర్ కూడా అప్పట్లోనే చెప్పాడు. దేశ రాజధాని ఢిల్లీలో మితిమీరుతున్న వాయు కాలుష్యం, గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావడానికి ఒక సువర్ణావకాశం తెచ్చిపెడుతోంది. దానిపై బీఆర్‌ఎస్ పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పాల్సి ఉంది.

డా. శ్రీరాములు గోసికొండ,

అసిస్టెంట్ ప్రొఫెసర్,

Next Story

Most Viewed