24 ఫ్రేమ్స్ :నవ్య సాహితీ సాంకేతిక ఒరవడి

by Disha edit |
24 ఫ్రేమ్స్ :నవ్య సాహితీ సాంకేతిక ఒరవడి
X

టెక్నికల్ వేగం మనిషి ఊహల కంటే వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే సానుకూలతనూ అందిస్తోంది. భావ ప్రసారం వేగంగానూ, తేలికగానూ జరగడానికి ఉపయోగపడుతోంది. సమాచార పరిధి విస్తరించి ప్రపంచం నలుమూలలకి చేరుతోంది. ఈ స్థితిని కవులు రచయితలు అంది పుచ్చుకోవాల్సి ఉంది. కవిత్వ లక్ష్యం అందరినీ చేరడమే అయినపుడు, అందరికి అందుబాటులోకి రావడమే అయినపుడు కవులు తమ కవిత్వ ప్రసార విస్తృతిని పెంచాల్సి ఉంది. పుస్తకాలలో ముద్రించి ఉంచడం వలన కేవలం అక్షరాస్యులకి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అదే కవిత్వం మౌఖిక సాంప్రదాయాన్ని అందుకుని పాడి, చదివి వినిపించినప్పుడు దాని పరిధి మరింత విస్తృతమౌతుంది.

దృశ్యం (ఇమేజ్) స్థిరమైనదైనా, కదిలేదైనా ఇవ్వాల ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంత మాధ్యమం. ప్రధాన ప్రసార పనిముట్టు అయిపోయింది. ఈరోజు ఎక్కడయినా ఎప్పుడైనా ఇమేజ్ లేకుండా జీవితం మనగలిగే పరిస్థితి లేదు. ఎప్పుడైతే కదలికను అందిపుచ్చుకుందో ఆ కదలిక మూవింగ్ ఇమేజ్‌గా (చలనచిత్రం) మారిపోయింది. మానవ జీవితంలో అంతర్భాగమైపోయింది. నిజానికి ఇమేజ్ అన్నది వాస్తవమా లేక మిథ్యా లేక మిథ్యావాస్తవమా? అన్నది తాత్విక అంశం. తాత్వికాంశాలు, సాంకేతికాంశాలు ఎట్లా ఉన్నప్పటికీ ప్రపంచం నలుమూలలలోనూ, ఇంకా చెప్పాలంటే అంతరిక్షం కలుపుని కూడా ఇమేజ్ ఈరోజు సర్వత్రా కనిపించే అంశం.

మనిషి తన భావవ్యక్తీకరణకి అది నుంచి రకరకాల మాధ్యమాలని వినియోగించుకుంటున్నాడు. సైగల కాలం నించి మొదలై చలనచిత్రం దాకా ఆ పరిణామక్రమం సాగింది. ఆ క్రమంలో మనిషి అనేక కళారూపాలను ఆవిష్కరిస్తూ పోయాడు. వాటిలో ప్రధానమైనది సాహిత్యం. అందులోనూ కవిత్వం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయడంతో మొదలయ్యే కవిత్వం చదవడమూ, వినడమూ అన్న ప్రక్రియల ద్వారా సాహితీప్రియులను చేరి భావచైతన్యాన్ని కలిగిస్తున్నది. అనేక శతాబ్దాలుగా ఈ కవితాయాత్ర సాగుతూనే ఉంది. అయితే, ఇలా మారుతున్న మాధ్యమ రూపాలూ, పెరుగుతున్న సాంకేతికత మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఊహకందని వేగం

టెక్నికల్ వేగం మనిషి ఊహల కంటే వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే సానుకూలతనూ అందిస్తోంది. భావ ప్రసారం వేగంగానూ, తేలికగానూ జరగడానికి ఉపయోగపడుతోంది. సమాచార పరిధి విస్తరించి ప్రపంచం నలుమూలలకి చేరుతోంది. ఈ స్థితిని కవులు రచయితలు అంది పుచ్చుకోవాల్సి ఉంది. కవిత్వ లక్ష్యం అందరినీ చేరడమే అయినపుడు, అందరికీ అందుబాటులోకి రావడమే అయినపుడు కవులు తమ కవిత్వ ప్రసార విస్తృతిని పెంచాల్సి ఉంది. పుస్తకాలలో ముద్రించి ఉంచడం వలన కేవలం అక్షరాస్యులకి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అదే కవిత్వం మౌఖిక సాంప్రదాయాన్ని అందుకుని పాడి, చదివి వినిపించినప్పుడు దాని పరిధి మరింత విస్తృతమౌతుంది.

ఇక్కడ లిఖిత మౌఖిక సాహిత్య లక్షణాలు చర్చనీయాంశాలే అయినప్పటికీ, కవి రాసిన అంశాల రీచ్ పెరగడం మాత్రం నిజం. లిఖిత మౌఖిక లక్షణాలతోపాటు దృశ్య లక్షణం కూడ జత చేస్తే అది మరింత విస్తారమైన జన జీవన స్రవంతికి మరింతగా చేరువయ్యే అవకాశం పెరుగుతుంది. కొత్త తరంలో చదివే అలవాటు పోయి చూసే అలవాటు పెరిగిందన్నది అందరూ గమనించిన అంశమే. సెల్‌ఫోన్ మెసేజ్ మొదలు ఇంటర్నెట్ యూట్యూబ్ ఇమేజ్ ట్రాన్స్ఫర్ దాకా ప్రయాణం చేసిన యువతకి కవిత్వాన్ని కూడా దృశ్య శ్రావణ మాధ్యమంలో అందిస్తే ఆదరించే అవకాశం వుంది. ఈ దృశ్య శ్రావణ మాధ్యమం అన్న భావననే విజువల్ బుక్ అంటున్నారు.

నిష్ణాతుల జీవిత చరిత్ర

గొప్ప వ్యక్తుల జీవితానంతరం కథనాత్మకంగా రూపొందించేవి బయోపిక్‌లు, వారి గురించి తీసేవి డాక్యుమెంటరీలు. సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ దృశ్యీకరించడం విజువల్ బుక్. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఈ విజువల్ బుక్ బహుళ ప్రచారంలోకి వస్తున్నది. దీనిని వినియోగించుకుని దేశవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరిగాయి. వివిధ రంగాల నిష్ణాతుల పైన విజువల్ బుక్‌ల నిర్మాణం జరుగుతూనే ఉన్నది. సుప్రసిద్ధ మలయాళీ రచయిత ఎం.టి వాసుదేవ్ నాయర్ పైన హరికుమార్ శక్తివంతమైన చిత్రం నిర్మించాడు.

బెంగాల్‌లో అరుణ్‌కుమార్ రేయ్ టాగోర్ అండ్ సినిమా రవీంద్రుని పైన మంచి ప్రయత్నం చేసారు. మలయాళీ రచయిత విజయన్ పైన జ్యోతి ప్రకాష్, సాహిత్య అకాడమీ తరఫున గుల్జార్, మహా శ్వేతాదేవిలాంటివారి పైన విజువల్ బుక్‌ల నిర్మాణం జరిగింది. బిస్మిల్లాఖాన్ పైన గౌతం ఘోష్, సత్యజిత్ రేయ్ పైన శ్యాం బెనెగల్, విక్రం సింగ్, గౌతం ఘోష్, ఉత్పలేందు చక్రవర్తి లాంటివారు అనేక చిత్రాలు తీసారు. తెలుగులోనూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ప్రజాకవి కాళోజీ కవితా గానం, జీవితాలను ఆచార్య భక్త వత్సలరెడ్డి వీడియో షూట్ చేసి ఉంచారు. గద్దర్ జీవితం, కవిత్వం మీద దేవీప్రియ 'యుద్ధనౌక గద్దర్' రూపొందించారు. తెలంగాణా సాహితీమూర్తులు 'ముద్దసాని రామ్‌రెడ్డి' 'యాది సదాశివ' గురించి వారాల ఆనంద్ రెండు విజువల్ బుక్‌లు రూపొందించారు. టి.వి.నారాయణ సహ దర్శకత్వం వహించిన ఈ రెండు చిత్రాలు ఆయా సాహితీమూర్తుల సజీవ దృశ్యాలుగా నిలిచిపోయాయి.

దీని గురించి ఆలోచించాలి

వీటన్నింటికి ముందు చిత్రకారుడు పి.టి. రెడ్డి సృజన పైన మనోహన్ దత్ అందమైన సృజన చేసారు. మంజీర రచయితల సంఘం 'కవి దృశ్యం' నిర్మించి విడుదల చేస్తున్నారు. నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, వజ్జల శివ కుమార్, షాజహానా, అల్లం నారాయణ, తైదల అంజయ్య, వరవరావు కవితాగానం చిత్రించబడింది. దేశపతి శ్రీనివాస్ దీనిని రూపొందించారు. కెమెరా వర్క్ చేసిన బాలాజీ దూసరి ఎంతో అభినందనీయులు. ఇంకా టోరీ రేడియోలో వస్తున్న అక్షరాల తెర వీడియోలు కూడా ఒక్కొక్కటీ ఒక్కొక్క విజువల్ బుక్కే. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరిగాయి. జరుగుతున్నాయి. అందరు కవులు తమ సృజనని దృశ్య శ్రవణ మాధ్యమంలో చిత్రించి భద్రపరచగలిగితే భావి తరాలకి ఎంతో మేలు జరుగుతుంది. కవులు, వారి కవిత్వం చిరస్థాయిగా మిగిలిపోతుంది.

- వారాల ఆనంద్

9440501281

Next Story

Most Viewed