నిమ్మ రైతు.. చెమ్మగిల్లె..

by  |
నిమ్మ రైతు.. చెమ్మగిల్లె..
X

దిశ, సూర్యాపేట: దళారీ మాయజాలంలో నిమ్మరైతుకు కంట నీరే మిగులుతుంది. ఈ ఏడాది లాభాల పంట అనుకుని వేసిన నిమ్మ పంట నిరాశ మిగుల్చింది. పెట్టిన పెట్టుబడులు రాక అంగట్లో అమ్ముకోలేక రోడ్ల మీద పంటను పరపోస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని అహర్నిశలు శ్రమిస్తున్న రైతన్న వ్యాపారి ముందు నిస్తేజంగా నిలబడిపోతున్నాడు. కుటుంబమంతా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.

బస్తకు 150 రూపాయలే..

సూర్యాపేట జిల్లాలో మునగాల, నడిగూడెం, మోతె మండలాల్లో ఎక్కువ శాతం నిమ్మ సాగు చేస్తారు. మందు బస్తాలకు, పురుగు మందు, కూలీలకు కలిపి ఎకరానికి లక్ష రూపాయల వరకు రైతుకు ఖర్చు వస్తుంది. ఎంతో శ్రమించిన బస్తా నిమ్మకాయ కోసి మార్కెట్ కి తేవడానికి రూ.165 వరకు ఖర్చు అవుతుంది. మార్కెట్లో మాత్రం రూ.150 నుంచి రూ.250 వరకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఒక బస్తాకు వంద రూపాయలు రైతు ఎదురు ఇవ్వవలసి వస్తుంది. మార్కెట్‌లో నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలసిన దళారులు 13 శాతం వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

దళారులను మేపుతున్నాం

ఏడాది అంత పని చేసి దళారులను బతికియాలసి వస్తుందని రైతులు బాధపడుతున్నారు. నిమ్మ పంట అమ్మెందుకు సరైన మార్కెట్ లేకపోవడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. దళారీ వ్యవస్థను తీసివేసి తామే పంటను అమ్ముకునే పరిస్థితి కల్పించాలని రైతులు కోరుతున్నారు. కరోనా వైరస్ వల్ల ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో మోటార్లుకు నీళ్లు చేరి నిమ్మ చెట్లు ప్రాణం పోసుకుని దిగుబడులు సైతం ఆశాజనకంగా వస్తున్నాయని రైతులు ఊరట చెందారు. కానీ ఇదే సమయంలో మార్కెట్ ధరలు పతనం చెందడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రేట్లు లేక పారబోస్తున్నాం..

నేనే మూడు ఎకరాల్లో నిమ్మతోట సాగు చేశాను. పదేళ్లుగా నిమ్మతోటలే నా జీవనాధారం. మూడెకరాలకు దాదాపు రూ.2 లక్షలకు పైనే ఖర్చు చేశాను. నిమ్మకాయలకు ఇప్పుడు మంచి సీజన్. కానీ, ఇప్పుడే నిమ్మకాయలకు ధర లేకుంటా పోయింది. కాయలు ఏరడం కన్న పారబోసింది నయంగా కన్పిస్తోంది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

– నాగరాజు నిమ్మరైతు,సీతానగరం

కూలీ ఖర్చులు నా మీదనే పడినయ్..

పోయినేడాది కాలం కలిసి రాక నిమ్మకాయలు కాయలే. ఈసారి కాస్తోకూస్తో కాలం అయ్యింది. నిమ్మకాయలు మంచిగనే కాసినయ్. ఇగ రెండు మూడేండ్లుగా పెట్టిన అప్పులు తీరుతాయని సంతోషపడ్డాను. అది మూడ్రోజుల ముచ్చగానే మారింది. బస్తా కాయకు రూ.200 పడింది. కూలీ ఖర్చులు నా మీదనే పడినయ్. ఏంజేయాల్నో తెలవట్లే. పోయినేడాది బస్తాకు రూ.వెయ్యి పైనే పడింది. ఈసారి కరోనా పాడుగాను భలే దెబ్బతీసింది. ఎట్లనన్న జేసి ప్రభుత్వం ఆదుకోవాలె.

– పల్లపు మంగమ్మ సీతానగరం, నిమ్మరైతు



Next Story

Most Viewed