ఆ కారణంతో మూత పడుతున్న ఇంటర్నెట్ షాపులు

by  |
Internet shops
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఉపాధి కోసం యువత ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం సాఫీగా సాగినప్పటికీ కరోనా వారిపై పడగ విసిరింది. దీంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రోజువారి కూలీ కూడా గిట్టుబాటుకాకపోవడంతో 50శాతానికిపైగా నెట్ సెంటర్లను మూసేశారు. ఉపాధికోసం నానాకష్టాలు పడుతున్నారు.

ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక.. కొంత మంది పై చదువులు చదివే ఆర్థికస్థోమత లేకపోవడం.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూడకుండా స్వశక్తిపై నిలబడి కుటుంబానికి చేయూత నిలబడాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 2.50 లక్షలకు పైగా ఇంటర్నెట్ సెంటర్లను నెలకొల్పారు. నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో సైతం నెట్ సెంటర్లను ప్రారంభించారు. సుమారు 5లక్షలపైగా ఆధారపడి జీవనం సాగించేవారు. అయితే కొంతకాలం సాఫీగానే సాగింది.

గతేడాదిన్నర క్రితం కరోనా తన ప్రభావం చూపడంతో సెంటర్లకు గిరాకీలు లేవు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సైతం కార్యకలాపాలు మందగించాయి. ప్రజలు సైతం కరోనాకు భయపడి ఇళ్లకే పరిమితం కావడంతో నెట్ సెంటర్లకు వచ్చేవారు కరువయ్యారు. దీంతో దుకాణం కిరాయి కూడా కట్టలేని పరిస్థితి నెలకొనడంతో 50 శాతం పైగా మూతపడ్డాయి. ఉన్నవాటిలో కూడా మరికొన్ని మూతపడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Internet

భారంగా అద్దెలు.. నెట్ బిల్లులు

నగరాల్లో నెట్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఒక్క మడిగ కిరాయి సుమారు రూ.10వేలు కాగా, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఉంటుంది. నెట్ బిల్లు రెండు కంప్యూటర్లకు రూ.వెయ్యి, అంతకు మించితే రూ.2వేల వరకుపైగా ఉంటుంది. అయితే కరోనాతో పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో ఇంటర్నెట్ కు వచ్చే యువత రావడం లేదు. దీనికి తోడు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వచ్చే వినియోగదారుల సంఖ్య కూడా తగ్గడం, పూర్తి స్థాయిలో పనులు జరుగకపోవడంతో ప్రజలు రావడం లేదు. దీంతో రోజుకు రూ.100 కూడా రాని పరిస్థితి నెలకొంది.

పుట్టగొడుగుల్లా జిరాక్స్ సెంటర్లు

ఒకప్పుడు విద్యార్థులతోపాటు అందరూ జిరాక్స్, నెట్ వినియోగాలనికి నెట్ సెంటర్లకు వచ్చేవారు. అయితే స్టేషనరీ, మొబైల్, కిరాణం దుకాణం, బుక్స్ షాపులు, ఫొటో స్టూడియోల్లో కూడా జిరాక్స్ మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో నెట్ సెంటర్లకు పరోక్షంగా దెబ్బపడింది. ఇదిలా ఉంటే పేపర్, జిరాక్స్ రిఫిల్ ఖర్చు సైతం పెరిగినప్పటికీ పోటీ నేపథ్యంలో తక్కువ ధరకు ఫ్రింట్ లు ఇస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాకున్న జిరాక్స్ లు ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఇది వాటి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.

రుణాలివ్వని బ్యాంకులు

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రుణసాయం కోసం బ్యాంకులు మొఖం చాటేస్తున్నాయి. రుణం ఇస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా చెల్లిస్తారని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధికోసం నెట్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటే ఉపాధి లేకుండాపోయిందని, బ్యాంకు రుణాలతో కొంత వెసులు బాటు కలుగుందని అనుకుంటే నిరాశే ఎదురవుతుందని నెట్ సెంటర్ల నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ సెంటర్లు నడపలేక… కుటుంబాన్ని పోషించుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆర్థికచేయూత నివ్వాలని పలువురు కోరుతున్నారు.

అప్పులు చేసి నడుపుతున్నా..

Krishnareddy

గత 15ఏళ్ల క్రితం ఉపాధి కోసం నెట్ సెంటర్ పెట్టా. మొదట్లో బాగానే నడిచింది. కానీ కరోనా వచ్చినప్పటినుంచి నెట్ సెంటర్ కు ఎవరూ రావడం లేదు. కనీసం రోజుకు రూ.100 కూడా రావడం లేదు. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి మరీ మడిగ కిరాయి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలి.
-కృష్ణారెడ్డి, ఇంటర్నెనెట్ సెంటర్ నిర్వహకుడు

కుటుంబ పోషణ భారమైంది

Venkanna

డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా కుటుంబానికి చేదోడు వాదోడు ఉండేందుకు నెట్ సెంటర్ ను ఐదేళ్ల కింద పెట్టా. స్కూళ్లు, కాలేజీలు నడిచేవి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు సైతం జిరాక్స్ ల కోసం వచ్చేవారు. నెట్ ను కూడా వినియోగించేవారు. అయితే కరోనాతో విద్యా సంస్థలు మూతపడటం, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేవారు తక్కువ కావడంతో షాపు కిరాయి, నెట్ బిల్లుతో పాటు ఇంటి అద్దెలు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ భారమైంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– నీరుడు వెంకన్న, ఇంటర్నెట్ సెంటర్ నిర్వహకుడు



Next Story

Most Viewed