నిపుణులు ఏమంటున్రంటే.. మనకు ‘నైపుణ్యం’ లేదంట!

by  |
నిపుణులు ఏమంటున్రంటే.. మనకు ‘నైపుణ్యం’ లేదంట!
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా విశ్వరూపం చూపుతోంది. దాదాపుగా వ్యవస్థలన్నీ కునారిల్లుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక మాత్రం ఆశల పల్లకిలో ఊరేగిస్తోంది. టీఎస్ ఐపాస్ లెక్కుల ద్వారా 14 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేస్తోంది. 12 వేల కంపెనీలు వస్తున్నాయని, రూ.1.96 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాయనీ చెబుతోంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో నైపుణ్య లోపం తీవ్రంగా ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ‘‘సాధారణ పరిస్థితుల్లోనే కార్మికుల కొరత తీవ్రంగా ఉంటోంది. ఇప్పుడేమో పరిస్థితులు చిత్రంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు ఉత్సాహం చూపే యువత కోసం భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. టీఎస్ ఐపాస్ లెక్కల ప్రకారం పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావం ఉంది. వాటన్నింటికీ స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరమే ఎక్కువ. ఈ క్రమంలో ప్రభుత్వ సంకల్పం మినహా మరో మార్గమేదీ కనిపించడం లేదు’’ అని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇన్‌సిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, నిథిమ్‌, నిఫ్ట్ వంటి సంస్థల ద్వారా ఇప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను మంచి ఉపకారవేతనాల ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మయన్మార్, వియత్నాం వంటి చిన్న దేశాల్లోనూ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆయా దేశ పరిస్థితులకు, భారత్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ అన్ని రాష్ట్రాల కంటే అధికమే. అయితే, పాలసీలను అమలు చేసే నాయకత్వం మీదనే పెట్టుబడులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అనివార్యమవుతుంది. ఐదేండ్ల క్రితం దీని కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల మీదే ఆధారం

రాష్ట్రంలో స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వలస కార్మికుల మీదనే జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు పని చేస్తున్నాయి. హమాలి పని నుంచి యంత్రాల ఆపరేషన్ వరకు అంతా ఇతర రాష్ట్రాల వారితోనే చేయిస్తున్నామని జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్లు యజమానుల సంఘం వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులతో రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి అవసరం ఎక్కువగా ఉందన్నారు. ప్రతి రంగంలోనూ బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది వస్తున్నారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ అన్నీ రకాల పనులకూ వారే. ఉపాధి అవకాశాలకు డిమాండ్ చేసే స్థానికులు మాత్రం నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ససేమిరా అంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుందనే వాదనలూ ఉన్నాయి.

కొత్త ప్రాజెక్టులు కష్టమే

పారిశ్రామీకరణ సాధ్యమే. కానీ, నెమ్మదిస్తుంది. ఇప్పటికే ఉన్న వాటిల్లో 100 శాతం మంది లేరు. విస్తరణకు వెళ్లాలనుకున్న వాటి వేగం తగ్గుతుంది. ఇక కొత్త ప్రాజెక్టులు కష్టమే. లేబర్ సమస్య ఎప్పటికీ ఉండేదే. ప్రభుత్వం స్థానిక యువత నైపుణ్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేప్టటాలి. తెలంగాణ యువత ఫోకస్ ఐటీ జాబ్స్ వంటి వాటిపైనే. మాల్స్, సర్వీసు సెక్టార్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్యాక్టరీల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదు. యువత పారిశ్రామిక రంగంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని గుర్తించాలి. ఉత్పాదక రంగంలో అనేక లాభాలు ఉంటాయి. డిగ్నీటీ ఆఫ్ లేబర్, సరిపడా సాలరీ ఇక్కడే సాధ్యం. స్కిల్స్ ఎంతగా పెంచుకుంటే అంత ఉత్పత్తి పెరుగుతుంది. కరోనా వైరస్ కాలంలో ఉత్పత్తులు కూడా తగ్గిపోయాయి. ఉపాధి హామీ పథకం కింద యూనిట్లను చేర్చాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టాలి. ప్రొబేషన్ సమయంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద వేతనాలు చెల్లించడం ద్వారా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు. నేర్చుకునే కాలంలో సంపాదన ఉంటే ఆసక్తి పెంచుకుంటారు. – కొండవీటి సుధీర్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య

పరిశ్రమల వేగం 40 కి పడిపోయింది

2014 తర్వాత పరిశ్రమలకు కలిసొస్తుందనుకున్నాం. తొలి రోజుల్లో బాగానే ఉంది. ఇప్పుడేమో పరిశ్రమల శాఖ వేగం 40కి పడిపోయింది. ఈ క్రమంలో లాక్ డౌన్. లేబర్ సమస్య. స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పరిశ్రమలకు కావాల్సిన అవసరాలేమిటో తీర్చే వ్యవస్థనే లేదు. డిపార్టుమెంట్ ముందుకెళ్లడం లేదు. పెద్ద పరిశ్రమలకు ఇబ్బంది లేదు. ఎంఎస్ఎంఈ రంగానికే కష్టాలు. ఓ పెద్ద పరిశ్రమకు సమస్య వస్తే దాని ఆధారంగా పని చేసే అనేక చిన్న యూనిట్లు మూతపడతాయి. తెలంగాణలో నైపుణ్యం కలిగిన కార్మికులు దొరకడం కష్టంగా మారింది. అందుకే ఇతర రాష్ట్రాల మీదనే ఆధారపడుతున్నారు. లాక్ డౌన్, కరోనా పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యువత నైపుణ్యం కలిగి ఉంటే ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. పరిశ్రమలకూ సమస్యలు తలెత్తవు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ కొరతతో కొత్త పరిశ్రమలకు అవరోధం కలుగుతుంది. – వెన్నం అనీల్ కుమార్, ఫ్యాప్సీ ప్రతినిధి

టీఎస్.ఐపాస్ కింద వచ్చిన యూనిట్లు

క్ర.సం సంవత్సరం యూనిట్లు పెట్టుబడులు (రూ.కోట్లల్లో) ఉపాధి అవకాశాలు
1. 2015-16 1536 28,989 94,454
2. 2016-17 1716 34,506 98,985
3. 2017-18 2821 57,444 2,74,646
4. 2018-19 2,836 34,837 6,04,865
5. 2019-20 3,112 40,626 3,17,421
మొత్తం 12,021 1,96,404 13,90,361

ప్రాజెక్టుల స్థితి

క్ర.సం ప్రొగ్రెస్ యూనిట్లు పెట్టుబడి ఉపాధి లభ్యత
1. ప్రారంమైనవి 9021 85,039 6,32,189
2. అడ్వాన్సుడ్ స్టేజ్ 760 26,957 2,70,557
3. ప్రారంభ దశ 751 51,859 2,73,316
4. మొదలు పెట్టాల్సినవి 1,489 32,548 2,15,299
మొత్తం 12,021 1,96,404 13,90,361

రానున్న మెగా పెట్టుబడుల ప్రాజెక్టులు

క్ర.సం రంగం పెట్టుబడి ఉపాధి
1. ఐటీ 25,000 1,425
2. ఆటోమొబైల్ 450 1,200
3. స్టీల్, బిల్డింగ్ 764 1,556
4. టెక్స్టైల్ 650 1500
5. ఎలక్ట్రానిక్స్ 16,891 73,750
6. లైఫ్ సైన్సెస్ 1,200 1000
7. ఫుడ్ ప్రాసెసింగ్ 892 2,613
మొత్తం 45,848 83,044



Next Story

Most Viewed