తెలుగువాడి గౌరవాన్ని మరింత పెంచుతా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 

by  |
NV RAMANA
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగువాడి గౌరవాన్ని మరింత పెంచుతానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పేందుకు కృషి చేస్తానని మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన పౌర సన్మానానికి సతీసమేతంగా సీజేఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పుకొచ్చారు. సాధించాల్సింది చాలా ఉందని అ అవార్డు తనకు గుర్తు చేసేలా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్‌ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇటీవల రాజ్యాంగంపై చాలా చర్చ జరుగుతోందని.. అదొక మంచి పరిణామమని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

తేనీటి విందులో సీఎం జగన్, జస్టిస్ ఎన్వీ రమణ

రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు వైసీపీ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియం ఇందుకు వేదికైంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం జగన్ నేరుగా విజయవాడ చేరుకున్నారు. అక్కడ నుంచి నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సీజేఐ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. సీజేఐకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం తిరుమల శ్రీవారి ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు. ఇకపోతే నాడు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ, ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తుల‌పై సీఎం జ‌గ‌న్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో రాష్ట్రవిష‌యాల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ జోక్యం చేసుకుంటున్నార‌ని.. అలాగే ఇత‌రేత‌ర‌ అంశాల‌ను సైతం ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌పై పలువురు వైసీపీ నేతలు విమర్శలు సైతం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సీజేఐగా నియమితులయ్యారు. ఈ పరిణామాల అనంతరం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణకు గౌర‌వార్థం ఏపీ ప్ర‌భుత్వం తేనీటి విందును ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వైఎస్ జగన్ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన తేనీటి విందు అనంతరం అక్కడి నుంచి సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌కు ఆహ్వానం మేరకు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు అక్కడకు వెళ్లారు. సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు రోటరీ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌర సన్మానం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరయ్యారు.

Next Story

Most Viewed