దివ్యాంగుల ‘భవిత’వ్యం ఎంత?

by  |
దివ్యాంగుల ‘భవిత’వ్యం ఎంత?
X

దిశ, రంగారెడ్డి: దివ్యాంగులకు భరోసా కల్పించే భవిత కేంద్రాలపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో భవిత కేంద్రాల పరిస్థితి దారుణంగా తయారైంది. బుద్ధిమాం ద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని దివ్యాంగ పిల్లలను గుర్తించివారిని భవిత కేంద్రాలను తీసుకొచ్చి, పరికరాల సాయంతో విద్యాబుద్ధులు నేర్పాలి. వారు ఇతరులు మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. సాధారణ విద్యార్థులుగా మార్చాలి. కానీ, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్న కొద్దివస్తువులతో ఆటలకే ఈ కేంద్రాలు పరిమితం అవుతున్నాయి. రెండేండ్లుగా పరికరాలు లేకపోవడంతో కేవలం అలంకారప్రాయంగానే భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించాల్సిన వైకల్య నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయలేకపోతున్నారు.

జిల్లాలో 32 భవిత కేంద్రాలు

పుట్టుకతో వివిధ కారణాలరీత్యా దివ్యాంగత్వం కలిగిన చిన్నారులకు విద్య నేర్పించేందుకు ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 32 భవిత కేంద్రాలున్నాయి. వీటిలో 8 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. మిగిలిన 24 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల పరిసరాల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి కేంద్రాల్లో విద్యార్థులను ప్రత్యేక బోధకులు(ఐఈఆర్‌పీ) సర్వే ద్వారా గుర్తించి దివ్యాంగులను చేర్పించారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు దివ్యాంగత్వం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను పారద్రోలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విద్యార్థులకు అవసరాలనుబట్టి కావాల్సిన పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాస్థాయిలో ప్రభుత్వరంగ సంస్థ అలీమ్‌కో(ఆర్టిఫీసియల్ లిమ్బస్ మానుఫ్యాక్చర్ కంపెనీ) ద్వారా ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. విద్యార్థులకు శారీరక పరీక్షలు నిర్వహించి దివ్యాంగత్వాన్ని నిర్ధారిస్తారు. వీటినిబట్టి ఆయా పరికరాలను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. వీల్‌చైర్‌, ట్రైసైకిల్‌, వినికిడి యంత్రాలు, క్యాలీపర్స్‌, క్రచెస్‌(చంకకర్రలు), మానసిక బుద్ధిమాంధ్యత కిట్టు(ఎంఆర్‌కిట్‌), బ్రెయిలీ కిట్‌, కళ్లద్ధాలు, బ్రెయిలీబుక్స్‌, రోలేటర్లు, ఫిజియోథెరపీ పరికరాలు అందించాల్సి ఉంటుంది. వీటి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తుంది. కానీ, 2018-19, 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన శిబిరాలు ఇంకా నిర్వహించకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఇది వరకే రావాల్సిన పరికరాలు రాలేదు. ప్రస్తుతం ఉన్న అరకొర పరికరాలతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. ఆయా పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది చిన్నారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది.

ఈ ఏడాది గుర్తిస్తే మరో ఏడాదికి

ఈ ఏడాది శిబిరంలో విద్యార్థుల సమస్యలు గుర్తిస్తే మరో ఏడాదికి కానీ పరికరాలు అందడం లేదు. ప్రతి యేడాది ఆలస్యంగా దివ్యాంగ విద్యార్థులకు పరికరాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. శిబిరం ఏర్పాటు చేసిన నెలకో, రెండు నెలలకో పరికరాలు అందిస్తే బాగుంటుంది. కానీ, ఏడాదికి ఏడాది పెండింగ్​లో ఉంటే విద్యార్థుల భవిత్వం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతి వారం ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తుండటంతో అనేకమంది విద్యార్థులు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వారి పిల్లలను మండల కేంద్రాల్లో ఉండే ఈ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. వీరికి ప్రభుత్వం రవాణభత్యం అందిస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో దివ్యాంగత్వం కలిగిన చిన్నారులు ఆయా సౌకర్యాలకు దూరమవుతున్నారు. జిల్లాలోని కేంద్రాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాలకులు, అధికారులు దృష్టి సారించి శిబిరం నిర్వహిస్తే అనేక మంది దివ్యాంగత్వం కలిగిన చిన్నారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.

జిల్లాలో ఉన్న భవిత కేంద్రాలు: 32
2017- 18ఏడాదిలో గుర్తించిన దివ్యాంగ విద్యార్థులు: 350
2018-19ఏడాదిలో గుర్తించిన దివ్యాంగ విద్యార్థులు: 381
2019- 20ఏడాదిలో గుర్తించిన దివ్యాంగ విద్యార్థులు: 398

tags : centres for disabled people, telangana state, Neglected



Next Story

Most Viewed