బడ్జెట్-2024పై 'మిలీనియల్స్' ఆలోచనేంటి!

by Dishanational1 |
బడ్జెట్-2024పై మిలీనియల్స్ ఆలోచనేంటి!
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై అందరికీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఇదే సమయంలో సరికొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న, వినియోగించుకునే కొత్త తరం, జనరేషన్ జెడ్‌పై కూడా కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉండనుంది. ఇరవైల్లో ఉండి, కొత్త శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక స్పృహ, ఖచ్చితమైన జీవన విధానాన్ని ఆశించే ఈ తరం బడ్జెట్ ప్రకటనల్లో తమకు అవసరమైన వాటిని గమనిస్తారు.

ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, సరసమైన విద్య, పన్ను మినహాయింపులకు సంబంధించి వారు బడ్జెట్‌లో ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం, జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ 2021లో ప్రపంచ జనాభాలో సగానికి పైగా(52 శాతం) ఉన్నారు. గతేడాది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లేఆఫ్స్‌కు బలవుతున్న ఈ తరానికి బడ్జెట్‌పై ఎన్నో ఆశలుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే వారి సంఖ్య అధికంగా ఉండే రంగాలకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేపట్టనుందనే అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు.

విద్య..

ఈ రంగంలో ఉన్న వ్యవస్థాపకులు తక్కువ ఖర్చులో స్కిల్స్ పెంచుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్‌పై సడలింపులు, ఈ రంగంలోని ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ తగ్గింపును కోరుతున్నారు. అలాగే, విద్యా రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని, జీఎస్టీ శ్లాబ్‌ను 18 శాతం నుంచి తగ్గించాలని, విద్యకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలపై 5 శాతం జీఎస్టీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇండియా ఎడ్‌టెక్ కన్సార్టియం కో-ఛైర్‌పర్సన్ మహేశ్వరి తెలిపారు.

అలాగే, దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను చేరువ చేసే డిజిటల్ మౌలిక సదుపాయలను మెరుగుపరచాలని కోరారు. ఇటీవల వార్షిక విద్యపై వెలువడిన నివేదిక ప్రకారం, గ్రామీణ భారతంలోని 14-18 ఏళ్ల వయసు ఉన్న యువకులలో సగానికి పైగా ప్రాథమిక సమస్యలను అధిగమించలేకపోతున్నారు. వారికి డిజిటల్ సాధనాలు, నైపుణ్యాలకు అవకాశం లేకపోవడం ఇందుకు కారణం. ఈ అంతరాన్ని తగ్గించేందుకు పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు అవసరమని నివేదిక అభిప్రాయపడింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారంతో ఈ రంగంలో మార్పులు తెచ్చేందుకు, కొత్త ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచే అవకాశం కల్పించే చర్యలు బడ్జెట్‌లో తీసుకోవాలని కోరుతున్నారు.

ఉద్యోగాలు..

ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే చర్యలపై జెనరేషన్ జెడ్ చాలా ఆసక్తి చూపిస్తోంది. ఈ మధ్యంతర బడ్జెట్‌లో దుస్తులు, ఆభరణాలు, హస్తకళల వంటి రంగాలకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) విస్తరణ చేయాలని ఆశిస్తున్నారు. ఇది మరిన్ని ఉద్యోగాలను సృష్టించి, తయారీని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అందిస్తున్నారు. కానీ, వాటిలో చాలా రంగాలు భారీ ఉపాధిని సృష్టించలేవు. లెదర్, గార్మెంట్, హస్తకళ, ఆభరణాలు వంటి రంగాలకు ఈ పథకం అవసరం. ఇవి తక్కువ ఆదాయ కుటుంబాలతో పాటు పట్ట ప్రాంతాలకు ఎంతో సహకారం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కరోనా మహమ్మారి తర్వాత వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. చాలా కంపెనీలు రిమోట్‌ పని విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెసులుబాట్లు కల్పించాలని నిపుణులు, యువత భావిస్తోంది. అదేవిధంగా ఫ్రీలాన్స్ ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపిస్తోంది. ఇది ఆదాయం పెంచుకునే మార్గాలను కల్పిస్తుంది. ఫ్రీలాన్స్, ఇతర సౌకర్యవంతమైన పని విధానాలకు మద్దతిచ్చే విధానాల అమలు ద్వారా గిగ్ ఎకానమీ వృద్ధికి అవకాశం కల్పించాలని కొత్త తరం భావిస్తోంది.

పన్నులు..

పెరుగుతున్న ఇంటి ఖర్చులు యువతకు ఆందోళన కలిగిస్తున్నందున ముఖ్యమైన అంశాల్లో మొదటిది. కొత్త తరం సరసమైన గృహాలు, ఆర్థిక చర్యల కోసం బడ్జెట్‌వైపు చూస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి నిర్మాణాలకు 30కి పైగా అనుమతులు అవసరమవుతున్నాయి. దీన్ని సులభతరం చేసేందుకు సింగిల్-విండో క్లియరెన్ సిస్టమ్ తీసుకురావాలని ఆశిస్తున్నారు. తక్కువ అనుమతులతో అందరికీ సొంతింటి కళ నెరవేర్చే అవకాశం కల్పించినట్టు అవుతుంది.

Next Story

Most Viewed