మరోసారి అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్!

by Disha Web Desk 13 |
మరోసారి అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్!
X

న్యూఢిల్లీ: భారత అత్యంత విలువ బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి తన అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 10.3 శాతం రెండంకెల వృద్ధితో టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 26.4 బిలియన్ డాలర్ల (రూ. 2.18 లక్షల కోట్ల)కు చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500-2023లో ఒక భారతీయ బ్రాండ్ 25 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి తర్వాతి పరిణామాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య కూడా దేశంలోని టాప్-100 అత్యంత విలువైన బ్రాండ్‌లు మెరుగైన వృద్ధిని ప్రదర్శించాయి. గత రెండేళ్లలో టాటా గ్రూప్ టెక్నాలజీ వినియోగం ద్వారా అత్యంత వేగంగా పరివర్తన చెందిందని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సవియో డిసౌజా అన్నారు. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ బ్రాండ్‌ విలువతో పాటు కంపెనీల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది.

పెట్టుబడులు, వినియోగదారులు, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్‌ రంగంలో ఉన్న సామర్థ్యం, భవిష్యత్తు ఆదాయ అంచనాలు, బ్రాండ్‌ పటిష్ఠత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కంపెనీల బ్రాండ్‌ విలువను లెక్కిస్తారు. అత్యంత విలువైన బ్రాండ్ జాబితాలో ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, రిలయన్స్, మహీంద్రా, తాజ్ హోటల్స్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఆటో, ఆదిత్య బిర్లా, టెక్ మహీంద్రా, ఎంఆర్ఎఫ్ కంపెనీలున్నాయి. ఇక, అత్యంత బలమైన బ్రాండ్‌గా రూ. 3,086 కోట్ల విలువతో వరుసగా రెండో ఏడాది తాజ్ గ్రూప్ నిలిచింది. మెటల్ రంగంలో టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత కంపెనీలు ఉండగా, వాహన పరిశ్రమలో మహీంద్రా ఆటో, టాటా మోటార్స్, మారుతీ సుజుకి ఉన్నాయి. దుస్తుల రంగంలో విలువైన బ్రాండ్‌గా రేమండ్ నిలిచింది.



Next Story

Most Viewed