గత పదేళ్లలో రిలయన్స్ మూలధన వ్యయం రూ.10 లక్షల కోట్లు

by Disha Web Desk 17 |
గత పదేళ్లలో రిలయన్స్ మూలధన వ్యయం రూ.10 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ గత పదేళ్లలో హైడ్రోకార్బన్, టెలికాం రంగాల విస్తరణలో భాగంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల($125 బిలియన్ల) పెట్టుబడులు పెట్టింది.రాబోయే మూడేళ్లలో కొత్తగా ఇంధన, రిటైల్ రంగాల్లో ఎక్కువ మూలధనాన్ని వెచ్చించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది, అలాగే సంస్థ సుదీర్ఘమైన ఇంటెన్సివ్ కాపెక్స్ విభాగాల నుంచి బయటకు రావాలని చూస్తుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఎనర్జీతో పాటు తక్కువ మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లకు ఎక్కువ ఆదరణ ఉన్న నేపథ్యంలో సంస్థ వీటిపై ప్రధానంగా దృష్టి సారించనుంది.

ఆయిల్-టు-కెమికల్ (O2C) వ్యాపారం, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి ఆర్థిక సంవత్సరం 2013-18 మధ్య కాలంలో రిలయన్స్ సుమారు రూ.2 లక్షల కోట్ల($ 30 బిలియన్ల) పెట్టుబడులు పెట్టింది. అలాగే, 4G/5G టెలికాం సామర్థ్యాలను మరింత విస్తరించడానికి 2013-24 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.5 లక్షల కోట్ల($60 బిలియన్ల) మూలధనాన్ని ఇన్వెస్ట్ చేసింది. ఇండియా వ్యాప్తంగా 5G రోల్‌అవుట్ పూర్తయిన నేపథ్యంలో టారిఫ్‌ల పెంపును రిలయన్స్ పరిశీలిస్తుంది. దీంతో సంస్థకు భారీగా నగదు ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.

2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ మూలధన వ్యయం రూ.1.46 లక్షల కోట్ల($17.6 బిలియన్ల) గరిష్ట స్థాయిని చేరుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేయగా, ఇది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.93 వేల కోట్లకు($11.2 బిలియన్ల) చేరుతుందని పేర్కొంది. అంతేకాకుండా రిలయన్స్ కొత్త వ్యాపారాలు అధిక రాబడిని ఇస్తాయని, EBITDA పెరిగి వేగవంతమైన కాపెక్స్‌ను సాధించగలదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.

Next Story