కార్పొరేటర్ ​ఇంటిపై దాడి చేసిన బీజేపీ నాయకులు.. ఆ మంత్రే కారణం అంటూ ఫైర్..

by  |
bjp
X

దిశ, జల్​పల్లి: మీర్‌పేట్ ​మున్సిపల్​ కార్పొరేషన్​ 13వ డివిజన్ ​బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్‌గా ​గెలిచిన ఎం.నరేంద్ర కుమార్, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్​పార్టీలో చేరారు. దీనితో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 13వ డివిజన్ ​కార్పొరేటర్ నరేంద్రకుమార్ ​వెంటనే కార్పొరేటర్​పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. కార్పొరేటర్ ​ఇంటిని బీజేపీ నాయకులు ముట్టడించడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పలువురి బీజేపీ నాయకులను వాళ్ళ ఇండ్ల వద్దనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కాగా మీర్​పేట్ మున్సిపల్​కార్పొరేషన్‌కు చెందిన 36వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్, కంటెస్టెడ్ ​కార్పొరేటర్లు వరికుప్పల బుచ్చిరాములు, ధ్యాసాని తిరుపతి రెడ్డి, రాళ్ళగూడం రామకృష్ణారెడ్డి, ధర్మేంద్ర సాగర్, లింగం, ఈశ్వర్​, మురళీ చారి, కృష్ణ తదితరులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ బడంగ్​పేట్‌లోని కార్పొరేటర్​ నరేంద్రకుమార్ ఇంటిని ముట్టడించారు.

గుడ్లతో కార్పొరేటర్ ఇంటిపై దాడి చేసిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని మీర్‌పేట్ పోలీస్​స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్​అయిన బీజేపీ నాయకులకు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జి అందెల శ్రీరాములు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 36వ డివిజన్​కార్పొరేటర్​ఎడ్ల మల్లేష్ మాట్లాడుతూ. దోచుకున్నవి దాచుకోవడానికి మంత్రి పదవికోసం సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్​ పార్టీలో చేరారని.. అదే కోవలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​పేట్​ కార్పొరేషన్, తుక్కుగూడ, మీర్​పేట్‌కు చెందిన ప్రజా ప్రతినిధులను స్వయంగా మంత్రే పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారని, సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్​పార్టీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. మొదట సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. .నరేంద్ర కుమార్ కార్పొరేటర్​పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్​ నుంచి పోటీ చేసి గెలుపొందాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఓడిపోతానన్న భయంతోనే మంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.



Next Story

Most Viewed