32 శాతం పడిపోయిన వాహన రిజిస్ట్రేషన్లు!

by  |
32 శాతం పడిపోయిన వాహన రిజిస్ట్రేషన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్న కొవిడ్ సెకెండ్ వేవ్ దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను అధికంగా ప్రభావితం చేస్తోంది. గతేడాది కరోనా మొదలైన తర్వాత అన్ని రంగాల కంటే వేగంగా వృద్ధి సాధించిన పరిశ్రమ సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు పెరగడంతో 2019, ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లు 32 శాతం క్షీణించాయి. గతేడాది ఏప్రిల్‌లో పూర్తిగా లాక్‌డౌన్ కారణంగా వాహన రిజిస్ట్రేషన్లు నమోదవలేదు. ఈసారి పరిశ్రమలో ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో అమ్మకాలు భారీగా క్షీణించాయి. ట్రాక్టర్ల విభాగం ఎప్పటిలాగే గణనీయమైన వృద్ధిని కొనసాగించాయి.

2019 ఏప్రిల్‌లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 14 శాతం, టూ-వీలర్ 31 శాతం, త్రీ-వీలర్ 64 శాతం, కమర్షియల్ వాహనాలు 49 శాతం తగ్గిపోయాయి. ట్రాక్టర్లు 16 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. “భారత్ ఇప్పుడు క్లిష్ట సమయాన్ని చూస్తోంది. సెకెండ్ వేవ్ అందరి జీవితాల్లోను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఈసారి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కరోనా పాకడం విషాదమని” ఫెడరేషన్ ఆఫ్ ఆటోంబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు. ఈసారి కేంద్రానికి బదులు రాష్ట్రాలే లాక్‌డౌన్ ఆంక్షలు విధించాయి. దీనివల్ల కేంద్రం, ఆర్‌బీఐ, ఆటో ఏఈఎంల నుంచి ఎలాంటి ఉపశమన చర్యలు లేవని ఆయన వివరించారు.

ఇక, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం.. టూ-వీలర్ వాహన రిజిస్ట్రేషన్లు 28 శాతం, త్రీ-వీలర్ 43 శాతం, ప్యాసింజర్ వాహనాలు 25 శాతం, ట్రాక్టర్లు 45 శాతం, కమర్షియల్ వాహనాలు 24 శాతం తగ్గాయి. ఇదే సమయంలో మే నెలలో కూడా వాహన రిజిస్ట్రేషన్లపై ఆశలు లేవని ఫాడా అభిప్రాయపడింది. లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో డీలర్‌షిప్‌లు, ప్లాంట్లు ఇంకా మూసివేతలోనే ఉన్నాయని వివరించింది. మే మొదటివారంలో వాహన విక్రయాలు చాలా తక్కువగా జరిగాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే మరో 15 రోజులు ఇలాగే ఉండొచ్చని, దీనివల్ల అక్కడక్కడా తెరిచిన డీలర్‌షిప్‌లలో వినియోగదారుల వాక్-ఇన్‌లు 30 శాతానికి పడిపోయాయని వింకేష్ గులాటి తెలిపారు.

పరిశ్రమ మహమ్మారి పరిస్థితుల నుంచి కోలుకునేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి మాత్రమే సాధ్యమయ్యేలా కనిపిస్తోందని ఫాడా తెలిపింది. మొత్తం అమ్మకాలు ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయాయని వెల్లడించింది. ప్రభుత్వం అవసరమైన ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఫాడా కోరుతోంది. అలాగే, ఆర్‌బీఐ ప్రతి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలయ్యే అన్ని రోజులకు సమానమైన లోన్ రీ-పేమెంట్ సడలింపు కోసం మార్గదర్శకాలను ఇవ్వాలని అభ్యర్థించింది.

Next Story

Most Viewed