Kurnool జిల్లా రైతులకు గంగ బెంగ.. ఆందోళనకు సన్నద్ధం

by Disha Web Desk 16 |
Kurnool జిల్లా రైతులకు గంగ బెంగ..  ఆందోళనకు సన్నద్ధం
X
  • ఆయకట్టు రైతుల గుండెల్లో గుబులు
  • ఏప్రిల్ 10 వరకే నీరిస్తామన్న ప్రభుత్వం
  • ఏప్రిల్ చివరి వరకు నీరివ్వకుంటే పంటలకు క'న'ష్టమే
  • మే 10 వరకు నీరివ్వాలని రైతులు, నేతల డిమాండ్
  • నీటి కోసం ఆందోళనకు సిద్ధమౌతున్న రైతులు
  • దృష్టి సారించని అధికార యంత్రాంగం

దిశ, కర్నూలు ప్రతినిధి: రబీ పంటల సాగు రైతులకు గంగ బెంగ పట్టకుంది. తెలుగు గంగ కింద సాగవుతోన్న పంటలకు ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకు మాత్రమే నీరిస్తామని ప్రకటన చేసింది. కనీసం ఏప్రిల్ చివరి వరకైనా నీరివ్వాలని, లేకుంటే పంటలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల అభిప్రాయం మేరకు తెలుగు గంగ అధికారులు నీరివ్వకుంటే మూడు మండలాల్లో దాదాపు 14 గ్రామాలకు చెందిన వేల మంది రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో మే 10 వరకు సాగు నీరివ్వాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు రైతుల సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు నీరివ్వాలని, లేకుంటే జలాశయాన్ని ముట్టడిస్తామని ఆందోళనకు సిద్ధమౌతున్నారు.


నంద్యాల జిల్లాలో 7 నియోజక వర్గాలు, 489 గ్రామ పంచాయతీలు, 3.67 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అయితే రాయలసీమ జిల్లాలకు సాగు నీటి అవసరాలు తీర్చే తెలుగు గంగ లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. జిల్లాలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద తెలుగు గంగ సాగు నీటిని అందించేందుకు అధికారులు జిల్లాల విభజన సమయంలో 1.14 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. అందులో రబీ సీజన్‌లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం రబీ సీజన్‌లో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద బండి ఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లో14 గ్రామాలు వెలుగోడు, చిన్న దేవలాపురం, వెంగళరెడ్డి పేట, నారాయణపురం, మోత్కూరు, బోయరేవుల, సింగవరం, సోమయాజులపల్లి, ఈర్నపాడు, కడమలకాల్వ, తిమ్మనపల్లి, లింగాపురం తదితర గ్రామాల్లో దాదాపు 32 వేల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. మరి కొందరు వరి నాట్లు వేశారు. అందులో అధికంగా చిన్న, సన్నకారు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వెలుగోడు రిజర్వార్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవిలో తాగు నీటి అవసరాల కోసం 3 టీఎంసీలు వాడుకున్నా ఇంకా 9.500 టీఎంసీల నీటిని రబీ రైతులకు మే 10 వరకు నీటిని ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకే సాగు నీరు అందిస్తామని ప్రకటన చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి సాగు కోసం రైతులు దుక్కి మొదలుకొని ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు వంటి వాటికోసం ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశారు.

అయితే ఇంకా మూడు నెలల కాల వ్యవధి ఉండడంతో అప్పటివరకు మరో రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేసే అవకాశం ఉంది. అంటే పంటలు చేతికొచ్చే వరకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయనున్నారు. ఖరీఫ్‌లో అతివృష్టి, అనావృష్టి కారణంగా చాలా మంది రైతులు పంటలు నష్టపోయారు. కనీసం రబీ సీజన్‌లో ఐనా పంటల దిగుబడి వస్తుందనే ఆశతో బ్యాంకర్లు అప్పులివ్వకపోయినా వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. ఇంత చేసినా ఏప్రిల్ నెల చివరిలో నీరివ్వమని తేల్చి చెప్పడంతో రైతులు కలత చెందుతున్నారు. గతంలో ఇదే సమస్య తలెత్తింది. ఆ సమయంలో వెలుగోడు రిజర్వాయర్‌లో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేది. అయినా రైతులు రబీలో వరి పంటలు సాగు చేశారు.

ప్రస్తుతం రిజర్వాయర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయినా ఏప్రిల్ చివరి వరకు ఎందుకు నీరివ్వరని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది 18 కిలోమీటర్ల పొడవునా కాల్వ పనులు చేస్తున్నామని నీరివ్వలేదు. ఈ సారి కూడా నీరివ్వకపోతే 30 వేల ఎకరాల్లో సాగు చేసే రైతులు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అధికారులు మాత్రం 66 రోజుల పాటు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తామని చెప్పడం రైతులను ఆందోళనలోకి నెట్టేసింది.

రిజర్వాయర్ ముట్టడికి సన్నద్ధం

రబీ రైతుల ఆయకట్టు రైతులకు ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు అందుతే రైతుల పంటలన్నీ చేతుకందుతాయి. అధికారులు ప్రకటన చేసినట్లుగా నీరు విడుదల చేస్తే మాత్రం ఈ సారి కూడా రైతులు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టపోయే ప్రమాదం ఉంది. రిజర్వాయర్‌లో 12.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు 3 టీఎంసీల నీరు అవసరం కాగా డెడ్ స్టోరేజీలో ఒక టీఎంసీ నిల్వ ఉంటుంది. అయినా రైతులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చు. కానీ ఏప్రిల్ 10 వరకే నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పడం ఏంటని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వెలుగోడు రిజర్వాయర్ కింద పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలకు మే 10 వరకు సాగు

నీరివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు, నాయకులతో కలిసి తెలుగు గంగ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. మే 10 వరకు నీరివ్వకుంటే రైతులతో కలసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో కాల్వ పనులు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. కానీ ఈ సారి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేందుకు సిద్ధమైందని, సాగునీటి విషయంలో నిర్లక్ష్యం వీడకుంటే రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని, అందుకోసం ఉద్యమానికి కార్యచరణ రూపొందించనున్నట్లు సమాచారం.


వారబందీ ప్రకారం నీరిస్తాం

- బి.వెంకటేశ్వర్లు, తెలుగు గంగ ఈఈ, నంద్యాల జిల్లా

వెలుగోడు రిజర్వాయర్ కింద పంటలు సాగు చేసే రైతులకు వారబందీ ప్రకారం సాగునీరు అందజేస్తాం. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 12.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వారబందీ ప్రకారం ఇవ్వాలని సూచనలిచ్చింది. వారం పాటు నీరివ్వకుండా 15 రోజుల పాటు 1500 క్యూసెక్కుల ప్రకారం నీటిని సరఫరా చేస్తాం. అయితే ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు మాత్రమే నీరివ్వాలని ఆదేశించింది. రైతులకు చెందిన ప్రతి ఎకరానికి సాగు నీరు అందించి పంటలు కాపాడుతాం. రైతులెవరూ ఆందోళన చెందవద్దు.


Next Story