పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. నంద్యాల ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

by Dishafeatures2 |
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. నంద్యాల ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి
X

దిశ, కర్నూలు ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. అందులో స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువు లోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులపై కూడా దృష్టి సారించాలన్నారు. అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చూడాలన్నారు. నమోదైన కేసుల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీ ఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. హత్య, ఇతర కీలకమైన కేసుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని, మహిళలు, చిన్నారుల అదృశ్యం కేసుల్లో అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకోవడంలో నిబద్ధత చూపించాలని సూచించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు హైవేపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని, అలాగే లారీ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి కంటేనర్, భారీ వాహనాలకు సీసీ కెమెరాలు ఎర్ఫటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పాపిలాన్ పరికరం ద్వారా వారి వేలి ముద్రలను తనిఖీ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను రవాణా, విక్రయించే వారిపై ఎండీపీఎస్ కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి ఎండీపీఎస్ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాలన్నారు. వీటిని అరికట్టడం వల్ల చిన్న పిల్లలు, యువతను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఆర్.రమణ, నంద్యాల, ఆళ్లగడ్డ డీఎస్పీలు మహేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, దిశ డీఎస్పీ మారుతీరావు, ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.



Next Story