గర్ల్ ఫ్రెండ్ బర్గర్ కొరికాడని.. స్నేహితుడిని కడతేర్చిన యువకుడు
దిశ, నేషనల్ బ్యూరో : అతగాడు ఆవేశాన్ని ఆపుకోలేక రగిలిపోయాడు.
దిశ, నేషనల్ బ్యూరో : అతగాడు ఆవేశాన్ని ఆపుకోలేక రగిలిపోయాడు. తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఊగిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ బర్గర్ను కొరికినందుకు ఏకంగా తన స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. ఈ పైశాచిక ఘటన పాకిస్తాన్లోని కరాచీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) నజీర్ అహ్మద్ మీర్బహర్ కుమారుడు డానియల్ ఓ రోజు తన గర్ల్ఫ్రెండ్ షాజియాను ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఆమె వచ్చే సమయానికే ఇంట్లో డానియల్ సోదరుడు అహ్మర్, స్నేహితుడు అలీ కిరియో ఉన్నారు. అయితే డానియల్ రెండు బర్గర్లకు ఆర్డర్ ఇచ్చాడు. రెస్టారెంట్ నుంచి వాటిని డెలివరీ బాయ్ తీసుకొచ్చాక.. తానొకటి తీసుకొని, గర్ల్ ఫ్రెండ్ షాజియాకు ఇంకోటి ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ బర్గర్లను తినసాగారు. ఈక్రమంలో డానియల్ స్నేహితుడు అలీ కిరియో వచ్చి షాజియా తింటున్న బర్గర్ను కొరికాడు. ఇది చూసిన డానియల్కు కోపం కట్టలు తెంచుకుంది. ఆ పక్కనే నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాక్కొని అలీ కిరియోపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అలీ కిరియోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు. వెంటనే డానియల్ను పోలీసులు అరెస్టు చేశారు. అలీ కిరియో స్థానిక సెషన్స్ జడ్జి కుమారుడు అని పోలీసులు గుర్తించారు.