వారంలోగా ఒప్పుకోండి..లేదంటే రఫాలో బీభత్సమే: హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత విషాదాన్ని నింపేలా కనిపిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నప్పటికీ ప్రధాని నెతన్యాహు వినడం లేదు.

Update: 2024-05-04 11:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత విషాదాన్ని నింపేలా కనిపిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నప్పటికీ ప్రధాని నెతన్యాహు వినడం లేదు. అంతేగాక ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు ఈజిప్ట్, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నా సత్పలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్‌కు ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వారంలోగా తాము ప్రతిపాదించిన విధంగా కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే రఫా నగరంలో సైనిక చర్య ద్వారా ముందుకు సాగుతామని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి.

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం, గాజాలో పట్టుబడిన బంధీల విడుదలకై చర్చించేందుకు మరోసారి తమ ప్రతినిధులను ఈజిప్ట్ రాజధాని కైరోకు పంపుతున్నట్లు హమాస్ తెలిపింది. అయితే కాల్పుల విరమణ, బంధీల విడుదల చర్చల్లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొంత పురోగతి ఉందని మరిన్ని విషయాలను వినడానికి వేచి ఉన్నామని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. రఫా నగరంపై దాడికి ముందు అక్కడి నుంచి పాలస్తీనా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై యూఎస్ అధ్యక్షుడు బైడెన్ చర్చిస్తున్నట్టు వెల్లడించారు. రఫాపై దాడి జరిగితే పాలస్తీనా పౌరులు భారీగా మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

శాశ్వత కాల్పుల విరమణకే హమాస్ మొగ్గు?

కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా..34500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఇరు పక్షాలకు పలు దేశాలు సూచిస్తున్నాయి. అయితే హమాస్ శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటుండగా..ఇజ్రాయెల్ దానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 40రోజులు మాత్రమే కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని చెబుతోంది. దీంతో ఈ అగ్రిమెంట్ ముందుకు సాగడం లేదు. 

Tags:    

Similar News