‘అంబటి, యరపతినేని ట్విట్టర్ వార్’

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రసార మాధ్యమాల్లో వాగ్భాణాలు సంధించుకున్న ఈ రెండు పార్టీల నేతలు.. కరోనా కట్టడి నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా వార్‌కి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. నిన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్సెస్ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచయిత మధ్య ట్విట్టర్ వార్ నెటిజన్లకు ఆసక్తి రేపగా, తాజాగా వైఎస్సార్సీపీ […]

Update: 2020-06-04 05:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రసార మాధ్యమాల్లో వాగ్భాణాలు సంధించుకున్న ఈ రెండు పార్టీల నేతలు.. కరోనా కట్టడి నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా వార్‌కి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. నిన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్సెస్ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచయిత మధ్య ట్విట్టర్ వార్ నెటిజన్లకు ఆసక్తి రేపగా, తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ మధ్య వార్ నడించింది. తొలుత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీలో ఆందోళన మొదలైందన్నారు. చంద్రబాబు రోజురోజుకూ పతనమవుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారన్న ఆయన, జగన్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. దేశంలోని సీఎంలలో జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని సర్వేని గుర్తు చేశారు. టీడీపీది ప్రజా వ్యతిరేక పాలన కాబట్టే ఆ పార్టీకి ప్రజలు కేవలం 23 స్థానాలే ఇచ్చారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ అయ్యారని అంటూ వారసుడిగా లోకేశ్ అప్‌డేట్ కాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఏడాది పాలనలో తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వాటి కోసం రూ.40,130 కోట్లను 3.57 కోట్ల లబ్ధిదారులకు అందజేసినట్టు చెప్పారు. చంద్రబాబు తన పాలనతో వేల కోట్లను గంగలో పోశారని, ఆయన పాలన మొత్తం దోపిడీమయమని ఆరోపించారు. చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోతే.. ఆ బకాయిలు జగన్ తీర్చారన్నారు. చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని రాంబాబు స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తమకు అపార గౌరవం ఉందని, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీం ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలు ప్రతిదానికి టీడీపీ అధినేత చంద్రబాబు వయసుపై విమర్శలు చేస్తున్నారని, ఏం.. వైసీపీ వాళ్లకు వయసు పెరగదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వయసుపై పదేపదే మాట్లాడే అంబటి రాంబాబు.. దమ్ముంటే ముందుకు వచ్చి చంద్రబాబుతో కలిసి తిరుమల కొండ ఎక్కడంలో పోటీ పడాలని సవాల్ విసిరారు. టీడీపీకి భవిష్యత్ నాయకత్వం లేదని విమర్శిస్తున్నారన్న యరపతినేని, వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నట్టు లోకేశ్‌కు అవినీతి కార్యకలాపాల్లో అనుభవం లేదని ఎద్దేవా చేశారు. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి దోపిడీ చేయడం, దొంగ సొమ్ము దాచుకోవడంలో లోకేశ్‌కు అనుభవం లేదని అన్నారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుందని ఆయన వ్యాఖ్యానిచారు, అమెరికాలో ప్రజాగ్రహానికి జడిసి ట్రంప్ ఎలా బంకర్‌లో దాక్కున్నాడో, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని యరపతినేని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ కూడా బంకర్లు నిర్మించుకోక తప్పదని అన్నారు.

Tags:    

Similar News