ఛైర్‌పర్సన్, ఎండీ పదవుల విభజన తప్పనిసరి కాదు: సెబీ!

Update: 2022-02-15 17:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్లలోని లిస్టెడ్ కంపెనీల్లో ఛైర్‌పర్సన్, ఎండీ పదవులను విభజించాలనే నిబంధన తప్పనిసరి కాదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం వెల్లడించింది. దీన్ని స్వచ్ఛందంగానే అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సంబంధిత పదవుల్లో ఉండేవారి బాధ్యతలను తెలపాలని గతంలో సెబీ పేర్కొంది.

అయితే తాజాగా దీన్ని తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న సమయంలో ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని అనుకోవడం లేదని సెబీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశం నేపథ్యంలో రాబోయే తరానికి సంస్కరణలు అవసరమని, దీనికోసం సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు తగిన సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెబికి సూచించారు.

సెబీ బోర్డు సమావేశంలో మాట్లాడిన ఆమె.. సెబీ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని, మార్కెట్ మధ్యవర్తిత్వ వ్యయాన్ని తగ్గించడం, ఇన్వెస్టర్లకు అందించే రక్షణను మరింత పటిష్టం చేయడం లాంటి చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్ మార్కెట్, గ్రీన్ బాండ్ మార్కెట్లను ఇంకా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News