దేశాన్ని కాపాడాలి.. ప్రజలకు KA PAUL కీలక పిలుపు
సెక్యులర్ వాదిగా ఉంటూ దేశాన్ని కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సెక్యులర్ వాదిగా ఉంటూ దేశాన్ని కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన సికింద్రాబాద్లోని హరి హర కళాభవన్లో ప్రపంచ శాంతి సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలే సమస్త దు:ఖాలకు కారణమని, ప్రపంచ ఆర్థిక అసమానతలు రూపుమాపడం ద్వారా ప్రపంచ శాంతిని సాధిద్దామని అన్నారు. అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్లోబల్ పీస్ మీటింగ్కు అందరూ హాజరు అవ్వాలని కోరారు.
గ్లోబల్ పీస్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు, ప్రజా యుద్ధ నౌక గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ గాయకులు విమలక్క, మాజీ ఎంపీ మల్లు రవి, రిటైర్డ్ జడ్జి చంద్ర కుమార్, జేడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రోశయ్య, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, జ్యోతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారని తెలిపారు. మతాల మధ్య చిచ్చులు పెడుతూ కొందరూ కుట్రలు చేస్తున్నారని, కావున ప్రజలందరూ లౌకికవాదంతో ముందుకు సాగాలని సూచించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. దేశంలో మనుషులందరికి సమానమైన గౌరవం దక్కాలని అన్నారు. ప్రజాస్వామ్యం కూడా మనుషులందరూ సమానత్వమే అని చెబుతుందని వివరించారు.