సామాన్యుల కష్టార్జిత ఖర్చుతో కార్పొరేట్లకు రెడ్ కార్పేట్: మహేష్ కుమార్ గౌడ్
ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ముందు సోమవారం నుంచి ధర్నాలు చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ముందు సోమవారం నుంచి ధర్నాలు చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు చెప్పారు. సామాన్యుల కష్టార్జితంతో ఖర్చుతో బీజేపీ కార్పొరేట్లకు రెడ్ కార్పేట్ వేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు వివరించారు. 29 కోట్ల ఎల్ఐసి పాలసీ హోల్డర్లు, 45 కోట్ల ఎస్బీఐ ఖాతాదారులపై ప్రభావం పడుతుందన్నారు.
మోడీ తన ప్రాణ స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అదానీ గ్రూప్లో ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేశారన్నారు. ఎల్ఐసీ అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడులు పెట్టి కొన్ని రోజుల్లోనే 39 కోట్ల మంది పాలసీ హోల్డర్లు, పెట్టుబడి దారులు 33,060 కోట్లు నష్టపోయారన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర భారతీయ బ్యాంకులు అదానీ గ్రూప్కు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చాయన్నారు. భారతీయ బ్యాంకులకు అదానీ గ్రూప్ సుమారు రూ. 80,000 కోట్లు బకాయిలు పడిందన్నారు. వీటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలన్నారు.