ఏనుమాములకు ఎవరొస్తారు..? నెలాఖరుతో పెద్ద కుర్చీలు ఖాళీ
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పెద్ద కుర్చీలు ఖాళీ అవుతున్నాయి.
దిశ, వరంగల్ టౌన్: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పెద్ద కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. ఉన్నతశ్రేణి కార్యదర్శితో పాటు గ్రేడ్-2 కార్యదర్శి పోస్టులు రెండూ ఒకేసారి ఖాళీ కానున్నాయి. ఆ స్థానాల్లో కొనసాగుతున్న క్యారం సంగయ్య, ఎండీ బియ్యాబానీకి ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. ఈ నెల 30న ఇద్దరూ రిటైర్ కానున్నారు. ఈ మేరకు 29న బియ్యాబానీకి, 30న సంగయ్యకు వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.
ఆరోపణల మధ్య విరమణ..
ఉన్నతశ్రేణి కార్యదర్శి సంగయ్య దాదాపు మూడు నెలల క్రితమే ఏనుమాముల మార్కెట్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడే పని చేసిన సంగయ్య పలు కారణాలతో బదిలీ అయ్యారు. అనంతరం రాహుల్ను ఇన్చార్జ్ కార్యదర్శిగా నియమించారు. జనవరిలో రాహుల్ బదిలీ కాగా, ఆయన స్థానంలో తిరిగి సంగయ్య నియమితులయ్యారు. ఆయన వచ్చిన తర్వాత మార్కెట్లో అక్రమాలు మరింత జోరందుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సంగయ్య రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నాడని, ఆరోగ్యం బాగోలేదనే ప్రచారం మధ్య ఉన్న కాలం కాస్త గడిచిపోయింది.
కార్యదర్శి పోస్టుకు పోటాపోటీ..
సంగయ్య రిటైర్మెంట్తో ఆ స్థానంలో కూర్చునేందుకు ఇప్పటికే పలువురు కన్నేసినట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట నుంచి ముక్రం, ఖమ్మం నుంచి నిర్మల, హుజూర్ నగర్ మల్లేశం, ప్రవీణ్ రెడ్డి, హుజురాబాద్ నుంచి జిరెడ్డి, కరీంనగర్ నుంచి పద్మావతితో పాటు మరికొంత మంది ఏనుమాముల ఉన్నతశ్రేణి కార్యదర్శి పోస్టును దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతమంది ఒక్క పోస్టుకు ఎగబడుతున్నారంటే.. ఆ ఉద్యోగ హోదాకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రస్తుతానికి డీఎంవో ప్రసాద్రావుకు కొంతకాలం ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలకవర్గం పదవీ కాలం ముగిసి. ప్రత్యేక ఇన్చార్జిగా జేడీఎం మల్లేషను నియమించారు. తాజాగా, కార్యదర్శి పోస్టులో కూడా ఇంచార్జి రానుండడంతో ఏనుమాముల మరిన్ని రోజులు ఇన్చార్జులతో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది.