కాల్వగట్లు గుల్ల..ఎస్సారెస్పీ కట్టలపై మైనింగ్కు పర్మిషన్లు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాకతీయ మెయిన్ కెనాల్ మొరం కట్టలపై మట్టి మాఫియా కన్ను పడింది.
దిశ, వరంగల్ బ్యూరో : ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాకతీయ మెయిన్ కెనాల్ మొరం కట్టలపై మట్టి మాఫియా కన్ను పడింది. కాకతీయ టెక్స్టైల్పార్కు అభివృద్ధికి, సంగెం మండలంలో రోడ్ల అభివృద్ధికంటూ వరంగల్ జిల్లాలోని గీసుగొండ, సంగెం, పర్వతగిరి మండలాల్లో విస్తరించి ఉన్న కాకతీయ కెనాల్ కాల్వగట్ల నుంచి మొరం తవ్వకాలకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ కాల్వకు రక్షణ గోడలుగా ఉన్న కట్టల నుంచి మొరం తరలింపునకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ అధికారులు అనుమతులివ్వడంపై రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరిట కాల్వగట్టులను నాశనం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కాల్వగట్టులపై ఉన్నవేలాది వృక్షాలను తవ్వకాలు జరుపుతూ అంతం చేసేశారు. కొండలాంటి కాల్వగట్టులను కాల్వకు సమాంతరంగా నేలమట్టం చేయడం గమనార్హం.
అనుమతులు కొంతే.. అక్రమాలు అనంతం..!
గీసుగొండ మండలంలోని వంచనగిరి నుంచి శాయంపేట శివారు వరకు ఉన్న కాకతీయ ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ కరకట్టల నుంచి మొరం తవ్వకాలకు కారుణ్య కన్స్ట్రక్షన్స్కు ఇరిగేషన్ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. 4000 క్యూబిక్ మీటర్ల మేర మొరం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈనెల 8వరకు మట్టి తవ్వకాలకు అనుమతులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ మాత్రం 4000 క్యూబిక్ మీటర్లకు మించి తవ్వకాలు సాగించినట్లుగా దిశ క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతోంది. అలాగే టెక్స్టైల్ పార్కులోని సబ్ స్టేషన్ అభివృద్ధి పనుల నిర్వహణకు గాను విక్రన్ అనే నిర్మాణ సంస్థకు సంగెం మండలంలోని కాట్రాపల్లి కెనాల్ 255 కిలోమీటర్ నుంచి 256 కిలోమీటర్ల మధ్యలో 4000 క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులిచ్చారు. ఈ సంస్థ నిర్వాకం అదే విధంగా ఉంది.
ఈ సంస్థకు 31-10-22 నుంచి 14-11-22 వరకు పదిహేను రోజుల పాటు తవ్వకాలకు అనుమతులిచ్చారు. అయితే వాస్తవంలో మాత్రం ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సంగెం మండలంలో జరుగుతున్న నాలుగు రోడ్ల నిర్మాణానికి గాను చల్లా ఇన్ఫ్రా అనే సంస్థకు 2వేల క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకాలకు అనుమతులిచ్చారు. గతనెల 16 నుంచి 24వ తేదీ వరకు గడువిస్తూ తవ్వకాలకు అనుమతులిచ్చారు. అయితే మూడు సంస్థలు కూడా తమకు కేటాయించిన క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో మొరంను తరలించుకెళ్లినట్లుగా రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు కూడా అందుకు అద్దం పడుతున్నాయి.
అనుమతుల మాటున ఆగమాగం..!
మూడు కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా అనుమతుల మాటున ఇష్టారాజ్యంగ వ్యవహరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు సంస్థలకు కలిపి 10వే క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకాలకు పరకాల డివిజన్ ఇరిగేషన్ ఈఈ సునీత అనుమతులు జారీ చేసినట్లుగా దిశకు లభించిన ఉత్వర్వుల కాపీలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఎస్సారెస్పీ కాల్వగట్టులపై విధ్వంసాన్ని తలపిస్తుండటం గమనార్హం. గీసుగొండ మండంలోని వంచనగిరి పరిధి నుంచి శాయంపేట శివారు వరకు, అలాగే సంగెం మండలంలో మొరం తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
పర్యావరణానికి హాని కలిగించకుండా తవ్వకాలు జరపాల్సిన సంస్థలు అవేమీ పట్టించుకోలేదు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్న చందంగా వ్యవహరించాయి. ఇరిగేషన్లోని క్షేత్రస్థాయి అధికారులైన ఏఈఈ, డీఈఈల సమక్షంలో జరగాల్సిన తవ్వకాలు నిబంధనలకు పాతరవేశాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5లోపు మాత్రమే జరగాల్సిన తవ్వకాలు...రాత్రిబవళ్లు సాగినట్లుగా తెలుస్తోంది. ఈ తవ్వకాలతో రైతుల భూముల్లోకి మట్టి, రాళ్లు, పెళ్లలు నెట్టబడుతున్నాయి. అలాగే రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులైన్లు ధ్వంసం కావడం గమనార్హం. ఈ అక్రమ తవ్వకాలపై త్వరలోనే పోరాటం చేస్తామని వంచనగిరి గ్రామస్థులు, రైతులు దిశకుల వెల్లడించారు.
అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు..!
ఎస్సారెస్పీ కాల్వగట్టుపై జరుగుతున్న విధ్వంసం వెనుక ఇరిగేషన్ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు స్పష్టమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉంటూ తవ్వకాలను పరిశీలించాల్సిన అధికారులు ఏమాత్రంపట్టించుకోకుండా అక్రమార్కులకు సహకరించినట్లుగా అవగతమవుతోంది. ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న నిబంధనలకు అధికారులే తూట్లు పొడుస్తూ తవ్వకాలు ఎలా జరిగినా మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇరిగేషన్ పరకాల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునిత వివరణ కోరేందుకు దిశ వరంగల్ బ్యూరో ప్రయత్నించగా, ఆమె స్పందించలేదు.
మట్టి కట్టలు కాల్వలకు రక్షణ గోడలు…
ఎస్సారెస్పీ కాల్వలకు ఇరువైపులా మట్టి కట్టలు రక్షణ గోడలుగా నిలుస్తున్నాయి. వర్షాలకు వరద వస్తే కాల్వలు కోతకు గురికాకుండా కాపాడుతాయి. అదే విధంగా కంపచెట్లు కాల్వలకు అడ్డురాకుండా నిలువరిస్తాయి. ఎక్కడైనా గండి పడితే వెంటనే మొరం పోసి పూడ్చటానికి వీలుగా ఉంటుంది. అదే విధంగా కాల్వ పరిధిలోని భూము లు ఆక్రమణకు గురికాకుండా నిలువరిస్తాయి. ఇన్ని రకాలుగా ఉపయోగపడే మట్టిని తరలించుకుపోవడంతో తీవ్ర నష్టం పొంచి ఉన్నది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.