ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరాడు: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని....MLC Kaushik Reddy hits out at MLA Etela Rajendhar
దిశ, కమలాపూర్: ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్ లో గురువారం జరిగిన చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 20 ఏళ్లు శాసనసభ్యుడిగా ఏడు సంవత్సరాలు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఈటల అభివృద్ధి చేసిందేమీ లేదని, మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా స్థానిక శాసనసభ్యులు హాజరు కావడం లేదని మండిపడ్డారు. ఉచిత కరెంటు, వ్యవసాయానికి ఎకరానికి పదివేల రూపాయలు, పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రమని అన్నారు. ఉచిత కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా? మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ నాయకులు కావాలా? అని ప్రశ్నించారు. ప్రజలందరూ అభివృద్ధిని గమనించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.