ఖిలావరంగల్.. ఫోర్జరీ కేసుపై సాగదీత..!
ఖిలావరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయ కేంద్రంగా ఫేక్నాలా డాక్యుమెంట్స్ తయారీ, తహశీల్దార్ ఫణికుమార్ సంతకం ఫోర్జరీ కేసుపై మిల్స్కాలనీ పోలీసులు దర్యాప్తును జాప్యం చేస్తూ వస్తున్నారు.
దిశ, వరంగల్ బ్యూరో: ఖిలావరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయ కేంద్రంగా ఫేక్నాలా డాక్యుమెంట్స్ తయారీ, తహశీల్దార్ ఫణికుమార్ సంతకం ఫోర్జరీ కేసుపై మిల్స్కాలనీ పోలీసులు దర్యాప్తును జాప్యం చేస్తూ వస్తున్నారు. తహశీల్దార్ ఫణికుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు నెలలైనా నిందితులను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తహశీల్దార్ ఫణికుమార్ సంతకం ఫోర్జరీ, ఫేక్ నాలా ప్రొసిడింగ్ డాక్యుమెంట్ల సృష్టి వ్యవహారంతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను పోలీసులు గుర్తించారు.
వీరిలో ఖిలా వరంగల్ మండల ఇన్చార్జి సబ్ రిజిస్ర్టార్ చిట్యాల ప్రవీణ్, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ దాసరి మునీందర్, డాక్యుమెంట్ రైటర్ గోనే రాంప్రసాద్, ప్రైవేట్ ఉద్యోగి ఇట్యాల సతీశ్లను కొద్దిరోజుల క్రితమే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మిగిలిన 11 మంది నిందితుల్లో తోటకూరి కొమురయ్య, తోటకూరి నర్సయ్య, తోటకూరి కుమారస్వామి, తోటకూరి కుమారస్వామి(మరొకరు), తోటకూరి కుమారస్వామి(ఇంకొకరు) తోటకూరి రాము, తోటకూరి లక్ష్మణ్, తోటకూరి సతీశ్, కందుల విజయ, కందుల శ్రావణ్ కుమార్, నూర మాధవి ఉన్నారు. వీరంతా పరారీలో ఉన్నట్లు ఈనెల 16న పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
కావాలనే జాప్యం చేస్తున్నారా..?
నిందితులందరికి సంబంధించిన పక్కా సమాచారం తెలిసీ కావాలనే అదుపులోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ మేరకు మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ను వివరణ కోరగా మిగతా 11 మందిని అదుపులోకి తీసుకుంటామని, కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. రిమాండ్లో ఉన్న చిట్యాల ప్రవీణ్, దాసరి మునీందర్, రాంప్రసాద్, సతీశ్ నుంచి ఫేక్ నాలా డాక్యుమెంట్స్ తయారీ, తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన విధానం, ఎన్ని డాక్యుమెంట్స్ను తయారు చేశారు..? వంటి అంశాలపై విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మూడు నెలలుగా దర్యాప్తును సాగదీసిన మిల్స్ కాలనీ పోలీసులు.. సీపీ ఏవీ రంగనాథ్ భూ వివాదాల కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో వెంటనే చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది.