రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.. లేకపోతే మనవ మనుగడకే ప్రమాదం: ప్రొఫెసర్ హరగోపాల్

భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు.

Update: 2024-05-07 15:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చితే మధ్యయుగాలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘భారత రాజ్యాంగం- హక్కులు- రిజర్వేషన్లు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని అన్నారు.

దేశ సంప్రదాయాన్ని విస్మరించి పాశ్చాత్య విధానంలో ఉందనే రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉంటుందా? లేదా.. అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. సంపద వృద్ధి కావాలి.‌. ఉద్యోగాలు ఊడగొట్టే విధానం తేవొద్దని.. సామాజిక న్యాయం లేని ఆర్థికాభివృద్ధి దేని కొరకు అని ప్రశ్నించారు. సంక్షేమ భావనను తగ్గిస్తూ.. ప్రైవేటైజేషన్ చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు. 2024 తర్వాత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యం తన పాత్ర సంక్షేమంలో తగ్గిస్తూ రక్షణ కోసమే పాలన చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి.. పాలకులు అనుకున్న రాజ్యాంగాన్ని తెస్తే ‘మనమేం చేయగలం’ అనేదానిపై చర్చ జరగాలని అన్నారు.

ప్రొఫెసర్ కాసీం మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభంలో ఉందన్నారు. దేశ నాయకత్వం సాధారణ మనుషులుగా మాట్లాడటమే ‌అందుకు నిదర్శనం అన్నారు. 1990లో మండల్ కమిషన్ వచ్చాకే బీసీల్లో కింది స్థాయి కులాలకు ఉద్యోగాల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ల కాన్సెప్ట్ వేరు.. వచ్చిన మూల సూత్రం వేరని తెలిపారు. రాజ్యం నుంచి పౌరులు రక్షించుకునే ప్రాథమిక హక్కులుగా వ్యవహరిస్తారని అన్నారు. దేశంలో అసమ్మతి లేకపోతే నియంతృత్వం వైపు వెళ్తోందని, ఏ దేశ రాజ్యాంగం సామాజిక, మానవీయ విలువలు కలిగినదని, రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. విభజించి పాలించు సిద్ధాంతంలో మోదీ పాలన కొనసాగుతుందన్నారు. అన్ని దేశాల రాజ్యాంగాల కంటే దేశ రాజ్యాంగం గొప్పదన్నారు. రాజ్యాంగాన్ని నమ్మని వారు ఆర్ఎస్ఎస్, మావోయిస్టులు, తీవ్రవాదులు మాత్రమే అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నారు. గతంలో రాజ్యాంగానికి సవరణలు చేశారు తప్ప మార్చలేదన్నారు. యువతలో మోదీ వ్యామోహం పెరుగుతుందని, ఇది చాలా ప్రమాదకరం అన్నారు. యువత ఆలోచించాలి.. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

విశ్రాంత జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చుతారని కాంగ్రెస్, మార్చమని బీజేపీ అంటున్నాయని, ఇందులో ఎవరిది కరెక్ట్ అని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం విద్యను పేద పిల్లలకు ఉచితంగా అందించడమే నేరమనే ఉద్దేశంతోనే కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు విద్యపైనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తాయని, దేశంలో మాత్రం చాలా తక్కువగా వెచ్చిస్తారన్నారని తెలిపారు. రిజర్వేషన్ల ఇవ్వొద్దనే కాన్సెప్ట్‌లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంత మూల పురుషులు రాసిన పుస్తకాలనే.. ఆచరణలోకి తెచ్చేందుకు.. మనువాదాన్ని అమలు చేసేందుకే ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మం, నీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని, ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో రిజర్వేషన్లకు పొగబెట్టే పని బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే కేంద్రంలోని ఓబీసీ ప్రధాని మోడీతోనే ఓబీసీలకు చీకటి రోజులు వచ్చాయన్నారు. పదేండ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేయలేదని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు జయసారథిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని సహజ సంపదను దోచుకోవాలంటే రాజ్యాంగం అడ్డుగా ఉందనే మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేత సంగిశెట్టి జగదీష్ మాట్లాడుతూ హక్కులను తీసివేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని ప్రాతిపదికగా బీజేపీ నేతలు పెట్టుకున్నారన్నారు. ప్రైవేటైజేషన్ చేస్తూ.. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు రెహమాన్ మాట్లాడుతూ దేశంలో ఫాసీజం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయకుండా కుల,మతాలతో రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, జంగిటి వెంకటేష్ , వేల్పుల సురేష్, కంచె రాజు పాల్గొన్నారు.

Tags:    

Similar News