కవితను కాపాడేందుకు బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం: RSP

ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవితను కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని

Update: 2023-05-25 07:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవితను కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని అందుకే రాష్ట్రంలో లేని ప్రతిపక్షం బీజేపీని ప్రజలకు ప్రత్యామ్నాయంగా చూపెడుతున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గత ఏడాది కాలంగా బీఎస్పీ ఇదే విషయాన్ని చెబుతోందని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫర్నిచర్ కు కవితకు సంబంధించిన షెల్ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వెళ్లాయని మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై ప్రవీణ్ కుమార్ గురువారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

రూ.80 కోట్లు క్రిప్టోకరెన్సీ, హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు వాంగ్మూలం ఇచ్చిన సాక్ష్యాలు ఈడీ వద్ద ఉన్నప్పటికీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ ఇక లేనట్లేనా అని నిలదీశారు. లిక్కర్ స్కాం కేసు నిందితురాలిని కాపాడుతున్న గజదొంగలు ఎవరో అందరికీ తెలుసని, కుంభకోణాల కేసీఆర్.. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. లిక్కర్ స్కాం, టీఎస్ పీఎస్సీ లీక్ లపై దృష్టి మళ్లించేందుకే దశాబ్ది ఉత్సవాల పేరుతో హాడావుడి చేస్తున్నాడని, జూన్ 2 నుంచి తెలంగాణ మీద బలవంతంగా రుద్దుతున్న ఉత్తిత్తి ఉత్సవాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని అన్నారు.

ఇవి కూడా చదవండి: రేకుర్తి ఇండ్ల కూల్చివేతలో మంత్రి గంగుల, ఎంపీ బండి సంజయ్ హస్తం..

Tags:    

Similar News