మానవత్వం చాటుకున్న రాచకొండ సీపీ DS చౌహాన్

రాచకొండ కమిషనర్ ​డీ.ఎస్.చౌహాన్​ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు

Update: 2023-04-03 15:30 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలకు గురైన బాలుడు ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చినట్టు తెలుసుకున్న రాచకొండ కమిషనర్​చౌహాన్​తన ఛాంబర్​నుంచి బయటకు వచ్చి బాలునితో మాట్లాడారు. చిన్నారి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. చేర్యాల గ్రామంలోని ఓ గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 6వ తరగతి చదువుతున్న తుమ్మల హరివర్ధన్​గాయాలకు గురయ్యాడు.

చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాడు. కాగా, ప్రమాదం జరిగినపుడు గాయపడ్డ హరివర్ధన్‌కు చికిత్స అందచేయటంలో గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే, వారిపై స్థానిక పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాంతో బాధితుడు సోమవారం కమిషనర్‌ను కలవటానికి ఆయన కార్యాలయానికి వచ్చాడు. విషయం తెలిసిన కమిషనర్​చౌహాన్​తన ఛాంబర్​బయటకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నపిల్లల రక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. హరివర్ధన్‌కు తోడుగా అతని చిన్నాన్న నరేష్​రెడ్డి వచ్చారు.

Tags:    

Similar News