‘పార్టీ మారుతున్నవారంతా మానవత్వం లేనివారే’
పార్టీ మారుతున్న వారంతా మానవత్వం లేని వారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ మారుతున్న వారంతా మానవత్వం లేని వారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవేళ్ల లోక్సభ పరిధిలోని నేతలతో తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉందని ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారని, వాళ్లు పార్టీ మారుతున్నారు. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవికి రిజర్వ్ చేసి పెట్టారట అన్నారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పిన మాదిరిగా చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకరించిపోతోందన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు.
గత 20 ఏండ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నానని, ప్రతిపక్షంలో ఉండి ఎలా పోరాటం చేయాలో అందరికీ తెలుసు అన్నారు. ప్రజల కోసం పని చేయాలని, ఈ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ ఏరియాలో ఏమన్న ఇబ్బంది ఉంటే చెప్పండి.. పరుగెత్తుకువస్తామన్నారు. కేసులకు భయపడేది లేదని, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న తట్టు తాకింది.. దాంతో వెనక్కి వెళ్లాల్సిన అసవరం లేదన్నారు. గట్టిగా పని చేసి కాసానిని గెలిపించి, కేసీఆర్ రుణం తీర్చుకుందాం అని పిలుపు నిచ్చారు. బడుగుల గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే ఆయనను గెలిపించాలని, కార్యకర్తల శక్తి ఏంటో ఇప్పుడు చూపించాలన్నారు. కేసీఆర్ అంటే ఏంటి..? కేసీఆర్ సైన్యం ఏంటో చూపించాలని కోరారు. తమకు వచ్చిన మెజార్టీ కంటే కాసానికి డబుల్ మెజార్టీ రావాలన్నారు.