స్టేట్‌వైడ్‌గా జోరుగా నామినేషన్ల ప్రక్రియ.. కరీంనగర్ కాంగ్రెస్‌లో మాత్రం డైలమా!

కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది.

Update: 2024-04-19 09:05 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అభ్యర్థిని ప్రకటించడంలో అధిష్టానం ఆలస్యం చేయడంతో ఇక్కడ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయి నామినేషన్ల ప్రక్రియ నేటితో రెండవ రోజు ముగుస్తున్నప్పటికి అభ్యర్థిని ప్రకటించకపోవడం కరీంనగర్‌లో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే నిన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూర్, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి హడావిడి చేసిన స్థానిక నాయకులు ప్రజల్లో అభ్యర్థి ఎవరనేది తెలియకుండా ప్రచారం చేయడంపై విస్మయం వ్యక్తం కావడంతో గందరగోళంలో పడ్డారు.

నాయకుడు ఎవరైనా పార్టీని గెలిపించాలంటు ప్రచారం చేసినప్పటికి ప్రజలనుండి అంతపెద్ద స్పందన కానరావడం లేదు. అయితే రాష్ట్రంలో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అయితే కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిచే పరిస్థితి ఉన్నప్పటికి అభ్యర్థిని ఖరారు చేయడంలో అధిష్టానం వ్యవహరించే తీరు స్థానిక కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుండగా జనంలో బిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరడం అంత తేలిక కాదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. 

Similar News