సీఎం వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: Boora Narsaiah Goud

రాష్ట్ర సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉందని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Update: 2023-01-31 11:06 GMT

దిశ, భువనగిరి రూరల్: రాష్ట్ర సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉందని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే పదం బూతు పదంగా మారిందని, నార్త్ కొరియా లాగా తెలంగాణలో కూడా కే‌సి‌ఆర్ వంశపారంపర్యంగా పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు నిజాం ఆత్మ ఆవహించినట్టుందని అందుకే సెక్రటేరియట్ ను ప్యాలెస్ లాగా కడుతున్నారని అన్నారు.

రాబోయే బడ్జెట్ లో వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు వెంటనే నిధులు విడుదల చేయాలని లేని యెడల ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి, సుదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్ గారు, కిసాన్ మెర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్ రావు, భువనగిరి పాలక్ బాలయ్య, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చిక్క క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News