MP అరవింద్.. అబద్దాలు మాట్లాడితే నాలుక చీరేస్తాం: MLA జీవన్ రెడ్డి వార్నింగ్
అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ జీవన్ రెడ్డి హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అబద్దాలు మాట్లాడితే అరవింద్ నాలుక చీరేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీగాళ్లకు ఏం తెలుసునన్నారు. అవినీతి సంపాదనతో వందల ఎకరాలు కొనుగోలు చేశారని, ఆ ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో అరవింద్ ఓ కుసంస్కారి అని ఫైరయ్యారు. కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అరవింద్కు లేదన్నారు. అరవింద్ అయ్యకు పదవి ఇచ్చి జీతం ఇచ్చి సాదింది కేసీఆర్ అని, తాగేందుకు సైతం నీళ్లిస్తున్నామన్నారు. ఆయన నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందేనన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు రెఢీనా అని సవాల్ చేశారు. నిజామాబాద్ అభివృద్ధిలో కేంద్రం వాటా నయా పైసా అయినా ఉందా? అని ప్రశ్నించారు.
దుర్మార్గుల పార్టీలో చేరిన ఈటెల కేసీఆర్ది దుర్మార్గ పాలన అనడం హేయనీయమన్నారు. హుజురాబాద్లో ఈటలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నందిపేట సర్పంచ్ దంపతుల ఆత్మహత్య యత్నం బీజేపీ కుట్ర అన్నారు. అరవింద్కు మూడిందని.. ఎంపీ పదవికూడా పోతుందన్నారు. అడ్డగోలు మాటలు మానుకొని ఆర్మూర్ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దావోస్కు వెళ్లింది పెట్టుబడుల కోసమని తెలిపారు. బీజేపీది మున్నాళ్ల ముచ్చటేనన్నారు. ఇక కేంద్రం లో బీజేపీ అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదని.. దేశానికి కాబోయే ప్రధాని కేసీఆర్యేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. అరవింద్ ఓ అబద్ధాల కోరు అని, నిజామాబాద్లో అరవై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లలో జరిగిందన్నారు. అరవింద్కు దమ్ముంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు సాధించి చూపాలని డిమాండ్ చేశారు. ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ యేనని అన్నారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ ఎంపీలు చేత కాని దద్దమ్మలు అని, నీచమైన భాష మాట్లాడితే ప్రజలు అరవింద్ భరతం పడతారన్నారు.