అప్పు చెల్లించడం లేదని బావను హత్య చేసిన బావమరిది
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకత్వ చెరువు సమీపంలో ఈ నెల 1వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు.
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకత్వ చెరువు సమీపంలో ఈ నెల 1వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ కిషన్ కుమార్లు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి కోహీర్కు చెందిన అన్వర్(27)కు మియాపూర్ హఫీజ్ పేట్కు చెందిన సయ్యద్ అహ్మద్ సోదరి షరీన్ బేగంతో 2019లో వివాహం జరిగింది. ఇదిలా ఉండగా అన్వర్ బావమరిది సయ్యద్ అహ్మద్ తన స్నేహితుడు అఖిల్ వద్ద నుంచి రోజు నాలుగు వందల కిరాయికి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్ వద్ద నుంచి అన్వర్ చేబదులుగా అప్పు తీసుకున్నాడు. అవి మిత్తితో కలిపి 1,45,000 రూపాయలు అయింది. దీంతో అఖిల్ తరచూ అన్వర్ను అప్పు తిరిగి చెల్లించాలని అడిగేవాడు. అన్వర్ అప్పు చెల్లించక పోవడంతో అఖిల్ తన మిత్రుడు అహ్మద్ ఇంటికి వెళ్లి అప్పు చెల్లించాలని గొడవ పడ్డాడు.
డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకొని మాటమార్చిన అన్వర్
గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన అహ్మద్ను తీసుకుని అఖిల్ కోహిర్లోని అన్వర్ ఇంటికి వెళ్లి అప్పు గురించి గొడవ పడ్డారు. అన్వర్ తల్లి సమక్షంలో తొందరలోనే డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి మరుసటి రోజు తిరిగి తన నుంచి కాదు అని చెప్పాడు. దాంతో అహ్మద్, అఖిల్లు డబ్బులు వసూలు చేసేందుకు అన్వర్ను జనవరి 1వ తేదీన నగరానికి తీసుకుని వచ్చారు. హపీజ్ పేట్లోని ఓ బార్లో మద్యం సేవించి అక్కడి నుంచి జూబ్లిహిల్స్కు వెళ్లి అక్కడ ఇమ్రాన్ అనే వ్యక్తిని కలిసి మళ్లీ మద్యం తాగారు. అక్కడి నుంచి ముళ్లకత్వ చెరువు సమీపంలోకి వచ్చి మత్తులో ఉన్న అన్వర్పై బీర్ బాటిళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ చంపవద్దని వారించినా వినకుండా అహ్మద్, అఖిల్లు కలిసి అన్వర్ను హత్య చేశారు. అన్వర్ నుంచి అప్పు తిరిగి రాదని, అఖిల్ తరచూ ఇంటికి వచ్చి అప్పు విషయంలో గొడవ పడుతుంటాడని, దాంతో అన్వర్ను అంతమొందించినట్టు అహ్మద్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్టు ఏసీపీ తెలిపారు. అన్వర్ హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ పేర్కొన్నారు.