ఒక ఆడబిడ్డను ఓడించాలని… కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారు : డీకే అరుణ

ఒక ఆడబిడ్డను ఓడించాలని, కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని బిజెపి మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-04-29 13:19 GMT

దిశ, హన్వాడ : ఒక ఆడబిడ్డను ఓడించాలని, కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని బిజెపి మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హన్వాడ మండలంలోని చిన్న దర్పల్లి, నాయినోనిపల్లి లలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ… జూటా మాటలు చెప్పి, ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యాడని ఆమె అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కానీ మోదీ అంటేనే గ్యారంటీ, మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం అని డీకే అరుణ అన్నారు.

అయోధ్యలో రామ మందిరం కట్టిస్తా అన్నారు కట్టించారని, ఆర్టికల్ 371 రద్దు చేసామని, సీఏఏ చట్టం అమల్లోకి తెచ్చామని, చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు తెచ్చామని, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామని, రేషన్ బియ్యం ఇస్తున్నాం, గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నాం, పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం అని వివరించారు. 500 ఏళ్లుగా ఎదురు చూసిన రాములవారి మందిరం నిర్మించి ఊరురా అక్షింతలు పంపిన మోడీని ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు.

అరుణమ్మకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, హైదరాబాద్ కంటోన్మెంట్ లో మహిళా అభ్యర్థి గెలవాలంట.. కానీ మహబూబ్ నగర్ లో అరుణమ్మ గెలవొద్దంట అనే ధోరణి సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆనాడు మామ, ఇప్పుడు అల్లుడు తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ అరుణమ్మ ఎవ్వరికి భయపడదని, నమ్మి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూసుకుంటా అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News