సంక్రాంతి పండగలోపు ఇండ్లు లేని లబ్ధిదారుల వివరాలు అందించాలి : KTR

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ మంగళవారం అకస్మీక పర్యటన చేశారు. జిల్లా అభివృద్దిపై అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2022-11-29 13:57 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి : రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ మంగళవారం ఆకస్మీక పర్యటన చేశారు. జిల్లా అభివృద్దిపై అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే సంక్రాంతి పండుగ లోగా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదల లెక్కను శాస్త్రీయంగా తేల్చి వివరాలను అందిస్తే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వగా మిగిలిన వారు ఉంటే సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునేందుకు వీలుగా సంతృప్త స్థాయిలో అందరికీ వారికి ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఐడీఓసీ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, మన ఊరు మనబడి కార్యక్రమం ప‌నుల పురోగ‌తి పై సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ స‌మీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మొత్తం 6,886 డబుల్ బెడ్రూం ఇండ్లలో 3952 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా వాటిలో 3447 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. వీటిలో ఇప్పటికే 1394 ఇండ్ల పంపిణీ చేయగా, ఇంకా 1746 ఇండ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంత్రికి చెప్పారు. పంపిణీ కి సిద్దంగా ఉన్న ఇండ్లను లాట‌రీ ప‌ద్దతిలో అత్యంత పార‌ద‌ర్శకంగా ఇండ్లను అర్హుల‌కు కేటాయించాల‌ని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాల‌న్నారు.ఇంకా ప్రారంభం కానీ ఇండ్లను సాధ్యమైనంత త్వర‌గా గ్రౌండింగ్ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.మంజూరైన ఇండ్లను గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత స‌ర్పంచ్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, ఎంపీపీల‌దే అని స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ మన ఊరు మనబడి కార్యక్రమ పనుల పురోగతిని జిల్లా విద్యాధికారి ధనాల కూడా రాధా కిషన్ మంత్రికి వివరించారు. జిల్లాలో మొత్తం 516 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 111 ఉన్నత పాఠశాలలు, 336 ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడత క్రింద రూ. 20 కోట్ల 38 లక్షల రూపాయలతో 172 పాఠశాలల్లో 579 ఎలక్ట్రికల్, టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, మేజర్ , మైనర్ పనులు చేపట్టామన్నారు.పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయని ఆయన మంత్రికి నివేదించారు. పురోగతిలో ఉన్న పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని మంత్రి జిల్లా విద్యాధికారులను ఆదేశించారు.

రాబోయే మార్చి నెలలోగా ప్రజల్లో చేతుల్లో ప్రగతి నివేదికలు పెడతాం

తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వెంటనే దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు. వైశాల్యం పరంగా చిన్న జిల్లా అయినా రాజన్న సిరిసిల్ల జిల్లా మిగతా జిల్లాల కంటే దీటుగా మిన్నగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం ,వ్యవసాయం, సాగునీరు ,తాగునీరు, విద్యుత్ ,సంక్షేమ రంగాలలో దేశానికే తలమానికంగా నిలుస్తుందని మంత్రి చెప్పారు.ఆ రంగాల ప్రగతిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ప్రగతి నివేదికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి రాబోయే మాసాంతం లోగా ఒక్కో రంగానికి సంబంధించి జిల్లాలో ఎంపిక చేసిన మండలంలో ప్రత్యేకంగా వేలాది మందితో సమావేశాలు నిర్వహించి ప్రతి వ్యక్తికి ప్రగతి నివేదిక కాపీలను అందజేస్తామని మంత్రి తెలిపారు. వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం దే అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందనీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 200 గురుకులాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 1000 కి పైగా గురుకులాలు ఏర్పాటయ్యాయని వీటిని ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల ,ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశామని చెప్పారు. వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల సహా అనేక కళాశాలను ఏర్పాటు చేశామన్నారు . విద్యా ప్రమాణాలను పెంచే దిశలో కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద రెండు విడతల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను పెంపొందించే పనులను చేపడతామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, పవర్ లూమ్స్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తెస్కాబ్ చైర్మన్ కొండూరీ రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లు సమ్మయ్య, అన్వేష్, కార్య నిర్వాహక ఇంజనీరు లు శ్రీనివాస్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News