అభివృద్ధికి నోచుకోని 12 వ వార్డు.. గ్రామ సభల్లో సర్దుబాటు చేస్తున్న సర్పంచ్

దిశ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సమస్యల..

Update: 2022-09-24 11:42 GMT

దిశ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సమస్యలను తీర్చకుండా , అభ్యర్థి పత్తా లేకుండా దుబాయ్‌లో ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో మితిమీరిన వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి గెలిచిన వార్డు సభ్యుడు సమస్యలను గాలికి వదిలేశారని, వార్డు ప్రజలు ఎన్నో సమస్యలతో అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా కోతుల బెడదతో గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కుంటున్నా తమకేమి సంబంధం లేనట్టుగా సర్పంచ్ వ్యవహరిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రతి నెల గ్రామ సభల్లో ఉండాల్సిన వార్డు మెంబర్ ఏడాదిగా పత్తా లేడని, అయినా తన పదవి కొనసాగుతూనే ఉందని ప్రజలు తెలుపుతున్నారు. అయితే ప్రతి నెల సభకు హాజరైనట్టుగా వార్డు మెంబర్ సంతకం చేయాల్సి ఉందని, కానీ వార్డు మెంబర్‌కు బదులుగా ఎవరు సంతకం చేస్తున్నారో తెలియదని, ఈ తతంగం అంతా అధికారుల జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కొనసాగుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Similar News