రేవంత్‌రెడ్డివి చిల్లర మాటలు.. సీఎంకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు అని, ఆయన మాటలకు క్రెడిబిలిటి లేదని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు.

Update: 2024-04-28 05:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు అని, ఆయన మాటలకు క్రెడిబిలిటి లేదని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హామీలు అమలు చేయకుండా సీఎం మాయమాటలు చెబుతున్నారని, ఓ జోకర్ లా మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడిన ఈటల.. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎంత మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించిందో చెప్పగలిగే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. మోడీ పాలనలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఇంత మంది బీసీలు ఉన్న కేబినెటి ఇదే ఫస్ట్ టైమ్ అన్నారు. ఓ బీసీ వ్యక్తిని ప్రధాన మంత్రి కావడం, కేబినెట్ లో 12 మంది ఎస్టీలు, 8 మంది ట్రైబల్స్ ఉండటం బీజేపీ ప్రభుత్వంలో సాధ్యమైందన్నారు. మొట్టమొదటి సారిగా దళిత బిడ్డను, గిరిజన బిడ్డను రాష్ట్రపతులుగా చేసిన చరిత్ర బీజేపీదని గడిచిన పదేళ్లుగా లేని అంశాన్ని ఇప్పుడు చర్చకు తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గందరగోళానికి దారి తీస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డితో జరిగిన సంభాషణపై స్పందించిన ఈటల.. బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకునే వ్యక్తిని తాను కాదన్నారు. పోరాడి గెలిచే వ్యక్తిని తానన్నారు. మల్కాజిగిరి ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.

కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మరో జన్మ ఎత్తినా వాటిని అమలు చేయడం సాధ్యం కాదని మల్కాజిగిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కాగ్రెస్ హామీలు ఇస్తుంటే ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తిగా వీటి అమలు సాధ్యం కాదని తాను మొత్తుకున్నానని తాజా మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని చాలెంజ్ చేస్తున్నారు ఆ స్థాయికి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ విలాస్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఆలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు.

Tags:    

Similar News