Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తొలి ఛార్జిషీట్.. ఆ ఏడుగురి పేర్లు నమోదు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ను స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ను స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. ఇందులో ఏడుగురి పేర్లను పేర్కొన్నది. తెలంగాణకు చెందిన ముగ్గురి పేర్లు ఇందులో సీబీఐ పేర్కొన్నది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ ఎండీ ముత్తా గౌతమ్, రాబిన్ డిస్టిల్లరీ కంపెనీ డైరెక్టర్లయిన బోయిన్పల్లి అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై తదితరులను పేర్కొన్నది. సీబీఐ తొలత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రథమ నిందితుడిగా పేర్కొన్నా ఛార్జిషీట్లో మాత్రం ఆయన పేరును ప్రస్తావించలేదు. కానీ ఆయనకు సన్నిహితులుగా ఉన్న విజయ్ నాయర్, దినేష్ అరోరా పేర్లను మాత్రం ప్రస్తావించింది. ఇప్పటివరకూ తెరమీదకు రాని కుల్దీప్ సింగ్ పేరును కూడా ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొన్నది. ఏ1 గా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఏ2గా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ బోయిన్పల్లి ఆ తర్వాత సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్రన్ పిళ్ళ, ముత్తా గౌతమ్లు ఉన్నారు. ఈ ఛార్జి షీట్ పై స్పెషల్ కోర్టు ఈ నెల 30న నిర్ణయం వెలువరించనున్నది. ఇప్పటివరకు జరిగిన విచారణలో లభ్యమైన వివరాలు, సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగా ఛార్జిషీట్ను రూపొందించినట్లు సీబీఐ తెలిపింది.