సీఎం కేసీఆర్‌కు కొత్త పేరు పెట్టిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

సీఎం కేసీఆర్‌ పథకాలు శాంపిల్‌కు మాత్రమే అంటూ జీహెచ్‌ఎంసీ సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన తెలిపారు.

Update: 2023-05-31 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌ పథకాలు శాంపిల్‌కు మాత్రమే అంటూ జీహెచ్‌ఎంసీ సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజలకు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, మిరపకాయ బజ్జీలు, సకినాలు, బాదుషాతో భోజనం పెడతానని చెప్పి.. తెల్ల అన్నం గొడ్డుకారం తినిపిస్తున్నాడని.. వెరైటీగా రకరకాల నోరూరించే వంటకాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మాటల మనిషే కానీ.. చేతల మనిషి కాదంటూ ఫైర్ అయ్యారు. ఓ ప్లేట్‌లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, మిరపకాయ బజ్జీలు, సకినాలు, బాదుషా వంటి స్వీట్లు, మరో ప్లేట్‌లో తెల్లన్నం, గొడ్డుకారం పెట్టి సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. ప్రజల కడుపు నిండాలంటే చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

కేవలం వాసన చూపిస్తే పేదప్రజల కడుపులు నిండవని అన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తానో కొత్త పేరు పెడుతున్నట్లు చెప్పారు. 'ఉత్తకూతల ఉత్తమరావు'గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తమంగా మాట్లాడటంతో పాటు ఉత్తమమైన హామీలు ఇచ్చే సీఎం కేసీఆర్.. వాటిని ఉత్తకూతలుగా ఉంచుతారే తప్ప అమలు చేయరన్నారు.

Tags:    

Similar News