HYD: ఆ ఒక్క పనిచేస్తే మాధవీలతకు 2 లక్షల మెజార్టీ గ్యారంటీ

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తమ పోరు ఓవైసీతో ఉండనుందని, అయితే ఇక్కడ బుర్ఖాల ద్వారా నకిలీ ఓట్లు వేయిస్తున్నారని, బుర్ఖాలో వచ్చి నకిలీ ఓట్లు వేసేవారిని బూత్‌

Update: 2024-05-04 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తమ పోరు ఓవైసీతో ఉండనుందని, అయితే ఇక్కడ బుర్ఖాల ద్వారా నకిలీ ఓట్లు వేయిస్తున్నారని, బుర్ఖాలో వచ్చి నకిలీ ఓట్లు వేసేవారిని బూత్‌లలో గుర్తించినట్లయితే ఓవైసీ ఓడిపోవడం ఖాయమని మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జనాబ్ జమాల్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బుర్ఖాలు వేసుకుని నకిలీ ఓట్లు వేయించి, అక్కడి ముస్లింలను కావాలని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మైనార్టీలు మార్పు కోరుకుంటున్నారని, కుటుంబ, అవినీతి పాలనను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్ బూత్‌లకు బుర్ఖాల్లో వచ్చి నకిలీ ఓట్లు వేసే వారిని గుర్తించగలిగితే మాధవీలత కనీసం 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.

గతంలో కొన్ని చోట్ల కనీసం కార్యకర్తలు కూడా తమ పార్టీకి లేరని, వాటిని డ్రై బూత్‌లుగా వాటిని పిలిచేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. యువతతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో పాలించిన పార్టీలు అవినీతి, కుటుంబ పాలన సాగించాయని జనాబ్ జమాల్ సిద్ధిఖీ విమర్శలు చేశారు. తమ వద్ద నేతలు నీతిమంతులు కాబట్టే ఇంత అభివృద్ధి సాధ్యమైందన్నారు. తమకు కొత్త ఓటర్లు, యువత మద్దతు ఉందని ఆయన కొనియాడారు. అవినీతి ముక్త్ భారత్, పరివార్ ముక్త్ భారత్ కావాలని ఆయన కోరారు. నిరుపేద బిడ్డ కూడా ప్రధాని అయ్యే పరిస్థితి రావాలన్నారు. తెలంగాణలో ఒక్క ముస్లింకు కూడా కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ ఎన్నికలు, ఓటు విషయం వచ్చే వరకు మాత్రం ముస్లింల పార్టీ అని కబుర్లు చెబుతారని విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం ఇఫ్తార్ విందు ఇస్తారని, టోపీలు పెట్టుకుంటారని, కానీ తీరా పదవులు మాత్రం ఇవ్వరని మండిపడ్డారు.

Tags:    

Similar News